CM KCR | ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రావినూతల శివారులోని మొక్కజొన్న రైతులతో పంట నష్టంపై ఆరా తీశారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, రైతుబంధు అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకుని దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. రెడ్డికుంట తండా నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం వెల్లి అక్కడి పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బ తిన్న పంటలను పరిశీలిస్తారు. అనంతరం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు.