పెద్దపల్లి : గడిచిన రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని ప్రసార మాధ్యమాల్లో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మంథని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ముక్త కంఠంతో ఖండించారు.
2014లో కవితక్క ఆశీస్సులతో మంథని టీఆర్ఎస్ టికెట్ దక్కించుకున్న తమ నాయకుడు పుట్ట మధు పార్టీ అభ్యున్నతికోసం అహర్నిశలు పాటుపడుతున్నాడని వారు తెలిపారు.
ఎమ్మెల్యేగా ఎన్నికయిన తర్వాత సీఎం కేసీఆర్ చలవతో మంథని నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చిదిద్దాడన్నారు. మంథని చరిత్రలో రానన్ని నిధులను ఐదేళ్లలో తీసుకువచ్చి అభివృద్ధి చేశాడని పేర్కొన్నారు. 2018లో దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా ఓడిపోయినా జెడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించి నియోజకవర్గ అభివృద్ధికి అండగా నిలిచారని కొనియాడారు.
అలాంటి కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీ పట్ల, కేసీఆర్, కేటీఆర్, కవిత పట్ల తమ నాయకుడు, తామూ ఎల్లవేళలా విధేయులుగానే ఉంటామని తెలిపారు. ఈటల రాజేందర్ విషయంలో ఆయన టీఆర్ఎస్ మంత్రిగా ఉన్న తరుణంలో ఆయనతో సన్నిహితంగా మెదిలామన్నారు. కానీ, ఆయన పార్టీకి దూరమైతే తామూ అతనికి దూరంగానే ఉంటామని తమకు పార్టీయే సుప్రీం తప్ప ఈటెల రాజేందర్ కాదని తేల్చిచెప్పారు.
ఈటల ఎపిసోడ్ ను అడ్డం పెట్టుకుని మంథని టీఆర్ఎస్ లో చీలిక తెచ్చి లబ్ధి పొందాలని కొందరు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. కావున మంథని నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు. టీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు యథావిధిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.