BR Ambedkar | హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్ చెంతనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మృతివనం ప్రారంభమైంది. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ కలిసి ఆవిష్కరించారు. దేశంలో అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో నెలకొల్పుతామని, స్మృతివనాన్ని తీర్చిదిద్దుతామని 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు నిర్దేశిత గడువు 2023 ఏప్రిల్ 30 కంటే ముందుగానే పనులు పూర్తి కావడం విశేషం.
చాలా గర్వంగా ఉంది. ఈ రోజు దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఆదర్శమూర్తి విగ్రహాన్ని తీర్చిదిద్దినందుకు ఈ అవకాశం తనకు కలిసి వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. బాబా సాహెబ్ బాటలో ఈ దేశాన్ని సరైన లైన్లో పెట్టేందుకు, చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేయడం జరుగుతుంది. రాజీపడే ప్రసక్తే లేదు. బాబా సాహేబ్ అంబేద్కర్ పుట్టిన రోజు సందర్భంగా జై భీమ్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
దేశంలో ప్రతి సంవత్సరం 25 లక్షల దళిత కుటుంబాలకు దళితబంధును అమలు చేస్తాం. అన్ని రాష్ట్రాలకు ఈ సదుపాయం అందుతుంది. అంబేద్కర్ కలలు సాకారం కావాలి. తప్పకుండా అవుతాయి. నిజమైన భక్తితో పేద ప్రజలను ఆశీర్వదించాలి. విజయం మనదే. మన రాష్ట్రంలో 50 వేల మందికి దళిత బంధు సాయం అందింది. ఈ ఆర్థిక ఏడాదిలో లక్ష పాతిక వేల మందికి అందబోతుంది. సద్వినియోగం చేయాలని కోరుతున్నాను.
ఈ రోజు మనవి చేస్తున్నాను. జాతీయ రాజకీయాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి పార్టీని జాతీయంగా విస్తరించారు అని ప్రకాశ్ అంబేద్కర్ చెప్పారు. 2024 ఎన్నికల్లో రాబోయే రాజ్యం మనదే. మహారాష్ట్రలో ఊహించని విధంగా ప్రోత్సాహం, ఆదరణ వస్తుంది. యూపీ, బీహార్, బెంగాల్తో పాటు ప్రతి చోట వస్తుంది.
అద్భుతమైన భారతదేశం, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు కూడా ప్రవేశపెట్టాం. అదే విధంగా నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. ఈ నెల 30 ప్రారంభించుకుంటున్నాం. ఆకాశమంతా ఎత్తు ఉండేటటువంటి.. ఎక్కడా లేని విధంగా ఈ మహోన్నతమైన విగ్రహాన్ని ప్రతిష్టించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. దళితుల అభివృద్ధి కోసం దళిత మేధావి వర్గం ఆలోచించాలి.
అందరం అంగీకరించక తప్పదు. అనేక పార్టీలు గెలవడం ఓడడం జరిగింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిరుపేదలు ఎవరంటే దళితులు అనే మాట వినబడుతుంది. ఇది మనకు సిగ్గుచేటు, పరిస్థితి మారాలి. ఓడిపోవడం గెలవడం కాదు. ప్రజలు గెలిచే రాజకీయం రావాలి. ఎవరి వైఖరి ఏ విధంగా ఉంది అనేది ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి ముందు 10 ఏండ్లు వేరే పార్టీ రాజ్యం చేసింది. దళితుల అభివృద్ధి కోసం 16 వేల కోట్లు ఖర్చు చేసింది. ఈ పదేండ్లలో దళితుల అభివృద్ధి కోసం ఒక లక్ష 25 వేల 68 రూపాయాలు ఖర్చుపెట్టాం.
కత్తి పద్మారావు సభకు వచ్చారో కాదో తెలియదు కానీ. అంబేద్కర్ పేరిట ఒక శాశ్వతమైన అవార్డు నెలకొల్పాలని సూచించారు. అంబేద్కర్ పేరిట అవార్డు ఇస్తాం. 51 కోట్లు డిపాజిట్ చేస్తాం. సంవత్సరానికి 3 కోట్ల వడ్డీ వస్తుంది. దాంతో దేశం, రాష్ట్రంలో ఉన్న వారికి ఉత్తమ సేవలందించిన వారికి అంబేద్కర్ జయంతి రోజున అవార్డులు అందజేస్తాం. 50 కోట్ల నిధి శాశ్వతంగా ఉంటుంది.
సచివాయలానికి అంబేద్కర్ పేరు పెట్టాం. ప్రతి రోజు సచివాలయానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ను చూస్తూ వారు ప్రభావితం కావాలి. ఆయన సిద్ధాంతం, ఆచరణ కళ్లలో మెదలాలని ఈ విధంగా రూపకల్పన చేశాం. ఇది విగ్రహం కాదు. విప్లవం. ఇది ఆకారానికి ప్రతీక కాదు.. ఇది తెలంగాణ కలలను సాకారం చేసే దీపిక.
హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం జయంతి నిర్వహిస్తున్నాం. పాటలు పాడుతున్నాం.. ఆడుతున్నాం. ఆక్రోషాన్ని తెలియజేస్తున్నాం. సంవత్సరాలు, శతాబ్దాలు గడిచిపోతున్నాయి. ఒక్కటే మాట మనవి చేస్తున్నాను. అంబేద్కర్ విశ్వమానవుడు. అంబేద్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనది. ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అణగారిన జాతులకు ఆశాదీపం అంబేద్కర్. ఈ రోజు ఆయన రచించిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతోంది. ఆయన చెప్పింది ఆచరించాలి. ఆ దిశగా కార్యాచరణ జరపాలి.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. తన ప్రసంగం కంటే ముందు కేసీఆర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని నినదించారు. సభికులు కూడా జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు.
దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేద్కర్ చెప్పారు. రెండో రాజధానిగా హైదరాబాద్ సరైందని అంబేద్కర్ చెప్పారు. పాక్, చైనాకు హైదరాబాద్ ఎంతో దూరంలో ఉంది. రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే ఆర్థిక అసమానతలను తొలగించొచ్చని అంబేద్కర్ నమ్మారు. బలిదానాలు జరగకుండా కొత్త రాష్ట్రాలు ఏర్పడే పరిస్థితి లేదు. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేద్కర్ మద్దతు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. తెలంగాణ కోసం కూడా ఎంతో పోరాటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది ప్రాణత్యాగం చేశారు. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ కొత్త చరిత్రను లిఖించింది.
సీఎం కేసీఆర్కు మనందరి తరపున ధన్యవాదాలు, అభినందనలు. అంబేద్కర్ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి. సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కర్ భావజాలం అవసరం. సమాజంలో మార్పు కోసం సంఘర్షణ తప్పదు. సమాజంలో మార్పుకోసం, అంతరాలను రూపుమాపేందుకు అంబేద్కర్ అహర్నిశలు పాటుపడ్డారు. రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధన పత్రం రాశారు. దళితబంధు పథకాన్ని చూసి గర్వపడ్డాను. దళితబంధు పథకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కేసీఆర్కు అభినందనలు. దళితబంధు పథకం సమాజంలో ఒక కొత్త దిశను చూపించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అయినా అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్యం ఇంకా దూరంగానే ఉంది.ఆదివాసీలు, దళితులు వృద్ధిలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ మరోచరిత్రకు నాంది పలికింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ కలిసి దళితబంధు విజయగాథలు అనే సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్దిదారుల మనోగతాన్ని సభికులకు వివరించారు.
అతిపెద్ద విగ్రహ స్థాపన ఘనత కేసీఆర్కు దక్కుతుంది. కేసీఆర్ చారిత్రక నిర్ణయం తెలంగాణకు గర్వకారణం. అంబేద్కర్ స్ఫూర్తితో దళితబంధు ఆదర్శంగా అమలవుతోంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ను సీఎం కేసీఆర్ సన్మానించారు. శాలువాతో సత్కరించి, బుద్ధుడి ప్రతిమను ప్రకాశ్ అంబేద్కర్కు కేసీఆర్ బహుకరించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాంపై హెలికాప్టర్ ద్వారా గులాబీ పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆ పూల వర్షాన్ని సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నినదించారు. అక్కడున్న ప్రజాప్రతినిధులంతా చప్పట్లతో పూల వర్షాన్ని స్వాగతించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సీఎం కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ కలిసి ప్రగతి భవన్ నుంచి ట్యాంక్బండ్కు బయల్దేరారు. మరికాసేపట్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.
125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి కేటీఆర్ సందడి చేశారు. కేటీఆర్తో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పోటోలు దిగారు.
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ అంబేద్కర్ను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్తో కలిసి ప్రకాశ్ అంబేద్కర్ భోజనం చేశారు. కాసేపట్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కేసీఆర్, ప్రకాశ్ అంబేద్కర్ బయల్దేరనున్నారు.
ఈశ్వరీబాయికి పదమూడో ఏటనే ఒక వైద్యుడితో వివాహమైంది. ఓ బిడ్డ పుట్టింది. కొంత కాలానికే భర్త చనిపోయాడు. దీంతో పుట్టింటికి వచ్చారు. సమాజంలో వివక్షను భరించారు. మహిళల స్వావలంబనకు కృషి చేశారు. నాగపూర్లో జరిగిన అఖిల భారత నిమ్న కులాల సభకు హైదరాబాద్ దక్కన్ ప్రతినిధిగా వెళ్లారు. అక్కడే తొలిసారి అంబేద్కర్ను కలిశారు. ఆయన ప్రోత్సాహంతో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. రాజకీయాల్లో చురుకుగా పని చేశారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలిగా వ్యవహ రించారు. చిలకలగూడ కార్పొరేటర్గా ఆమె విజయ ప్రస్థానం మొదలైంది. రిపబ్లికన్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ప్రతిపక్ష నాయకురాలిగా ‘ఫైర్బ్రాండ్’ అనిపించుకున్నారు.
బాబా సాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్.. జీవితాన్ని అపారంగా ప్రభావితం చేసిన స్త్రీమూర్తులు.. రమాబాయి, డాక్టర్ సవిత. పరిపూర్ణ వ్యక్తిగా, న్యాయశాస్త్ర కోవిదుడిగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్న సమయంలో రమాబాయి.. తోడుగా నిలిచారు. పిడకలు అమ్మి కుటుంబాన్ని పోషించారు. మలిదశలో, ఆయన జీవితంలోకి ప్రవేశించిన డాక్టర్ సవిత.. వైద్యం చేసి, ఆయువు పోసి లక్ష్య సాధనలో నీడగా నిలిచారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ ఇద్దరినీ స్మరించుకోవాలి.
స్త్రీ విద్య, సమానత్వం ఆకాంక్షించిన వారిలో అగ్రగణ్యుడు అంబేద్కర్. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నారు. రాజ్యాంగ రచన సమయంలో హిందూ కోడ్ బిల్లును పక్కాగా పార్లమెంట్కు సమర్పించారు. ఈ బిల్లులో… ‘స్త్రీ భర్తకు బానిస కాదు, ఆమెకు కూడా భర్తకు ఉండే హక్కులన్నీ ఉంటాయి. ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా ఆస్తి హక్కూ ఉంటుంది. స్త్రీలు సైతం పిల్లలను దత్తత తీసుకోవచ్చు, ఇవ్వవచ్చు. వారసత్వ ఆస్తిలో దత్త పుత్రుడితో సమానంగా దత్తత తీసుకున్న తల్లికి కూడా హక్కు ఉంటుంది. స్త్రీలు కులాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకోవచ్చు.
బహు భార్యత్వం రద్దు. విడాకుల ద్వారా భార్యాభర్తలు వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ వారసత్వ ఆస్తిలో సమభాగాలు దక్కుతాయి’ అంటూ ప్రత్యేకమైన క్లాజ్లను రూపొందించారు. వివాహంలో స్త్రీ నిర్ణయాధికారాన్ని సమర్థిస్తూ, స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ రూపొందించిన బిల్లు సంప్రదాయవాదుల్లో ఆగ్రహం కలిగించింది. దీనిని ఆమోదించవద్దంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పార్లమెంట్లోనూ అడ్డు తగిలారు. మార్పులు కోరారు. చర్చ వాయిదా పడుతూ వచ్చింది. మెజారిటీ సభ్యుల మొండిపట్టుతో అంబేద్కర్ విసిగిపోయారు. తన కృషి వృథా అయిపోతున్నందుకు తీవ్రంగా బాధపడ్డారు. 27 సెప్టెంబరు 1951న కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆదిహిందూ ఉద్యమం ఆధ్వర్యంలో.. 1942లో హైదరాబాద్లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి డాక్టర్ అంబేద్కర్ వస్తున్నారని సదాలక్ష్మికి తెలిసింది. అప్పుడు ఆమె వయసు పన్నెండు. లక్ష్మి వాళ్ల నాన్న పారిశుద్ధ్య కార్మికుడు. తమలాంటి నిమ్న జాతుల కోసం పనిచేసే అంబేద్కర్ను ఎలాగైనా చూడాలనుకుంది. అప్పటికే ఆమె గాంధేయ వాదులు నడిపే బాలల సంఘంలో సభ్యురాలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుర్రపు బగ్గీపై బొల్లారం నుంచి హైదరాబాద్ వచ్చింది. అంబేద్కర్ ఉపన్యాసం విన్నది. ఆ సభ తన జీవితాన్నే మలుపుతిప్పింది.
తర్వాతి కాలంలో ఆమె కాంగ్రెస్, మరికొన్ని పార్టీల్లో పనిచేశారు. ఉన్నత విద్యను పక్కనపెట్టి ఎన్నికల రాజకీయాల్లో దిగారు. ఉభయ సభల సభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా పలు హోదాలు చేపట్టారు. 1963లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటే అగ్రనేతలు ఏమనుకుంటారోనని కాంగ్రెస్లోని కొంతమంది నేతలకు భయం పట్టుకుంది. ఎందుకొచ్చిన గొడవని మౌనంగా ఉండిపోయారు. కానీ సదాలక్ష్మి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకూ చొరవ తీసుకున్నారు. ‘బాబా సాహెబ్ నా వ్యక్తిత్వ రూపశిల్పి. ఆయన ఆలోచనలు, అభిప్రాయాలు, విలువలు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాను’ అనేవారామె.
ఆధునిక భారతానికి మార్గదర్శకంగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక చింతనలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సైద్ధాంతికంగా అమలు చేసి చూపిస్తున్నది. దళితులపట్ల సమాజంలో నెలకొన్న దృక్పథాన్ని గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో కేసీఆర్ సమూలంగా మార్చివేయటమే ఇందుకు నిదర్శనం. అంబేద్కర్ తాత్వికచింతన బాటలో కేసీఆర్ సర్కారు నడుస్తున్నదనడానికి ఇవే కొన్ని ఉదాహరణలు..
అంబేద్కర్ చెప్పింది: ఏది విడిచిపెట్టినా పర్వాలేదు. కానీ, ఉన్నత విద్యను అభ్యసించే హక్కును జారవిడుచుకోవద్దు.
కేసీఆర్ చేసింది: దళిత, గిరిజన, బహుజన, మైనారిటీవర్గాలకు సమాజంలో సమాన గౌరవం దక్కాలంటే ఉన్నతవిద్యతోనే సాధ్యమవుతుందని సీఎం కేసీఆర్ ముందే గ్రహించారు. ప్రాథమికవిద్యతో ఆపకుండా విదేశాల్లో కూడా దళిత విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ‘డాక్టర్స్, ఇంజినీర్స్ మేడిన్ తెలంగాణ గురుకులాస్’ అనేలా సకల సౌకర్యాలు కల్పించారు.
అంబేద్కర్ చెప్పింది: అత్యున్నతమైన సాంస్కృతిక జీవన విధానాన్ని కొనసాగిస్తేనే మనిషికి పరిపూర్ణమైన ఆనందం లభిస్తుంది. వారసత్వ కట్టడాలు గత చరిత్రకు సాక్ష్యాలు.
కేసీఆర్ చేసింది: ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘సమ్మక్క-సారలమ్మ’ వేడుకను కేసీఆర్ ప్రభుత్వం ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నది. వందలాది వారసత్వ కట్టడాలకు కొత్త జవసత్వాలు అద్దడాన్ని కేసీఆర్ ఓ దీక్షలా భావించారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య, కళా వైభవాల పరిరక్షణకు కృషి చేశారు.
అంబేద్కర్ చెప్పింది: ఓ ప్రాంతం సమ్మిళిత అభివృద్ధికి నోచుకోవాలంటే నదీ జలాల సంరక్షణే అసలైన మార్గం.
కేసీఆర్ చేసింది: ఉమ్మడి రాష్ట్రంలో ఎడారిలా కనిపించిన తెలంగాణ.. ఇప్పుడు పచ్చదనంతో సిరిచేలను తలపిస్తున్నది. అపర భగీరథుడిలా మారి కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో పుడమి తల్లి గొంతుకనే కాకుండా ప్రజల దాహార్తిని కూడా కేసీఆర్ తీర్చారు. ఇప్పుడు దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది .
అంబేద్కర్ చెప్పింది: వికేంద్రీకరణ ఆవశ్యకతను గుర్తిస్తేనే, దేశాభివృద్ధి సాధ్యం.
కేసీఆర్ చేసింది: పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చడమే కాదు.. కొత్త కలెక్టరేట్లు, పంచాయతీలు, సబ్-రీజినల్ డెవలప్మెంట్ను యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రభుత్వ సేవలను గ్రామగ్రామానికి విస్తృతం చేశారు.
అంబేద్కర్ చెప్పింది: శూద్రులు, వృత్తి పనుల వారు సంపదను అనుభవించాలి.
కేసీఆర్ చేసింది: దళిత బంధు పథకం ద్వారా సంపద సృష్టించే వారికి దాన్ని అనుభవించే హక్కు కూడా ఉండాలంటూ కూలీలను కూడా యజమానులుగా మారుస్తూ వ్యాపార అవకాశాలూ కల్పించారు.
హైదరాబాద్లో 1932 సెప్టెంబర్ 3న తొలిసారిగా అంబేద్కర్ అడుగుపెట్టారు. నిజాం ప్రభుత్వ 72వ సమావేశానికి ఆయన హాజరయ్యారు. 1942లో మరోసారి, 1944లో నగరంలో ఎస్సీ ఫెడరేషన్ మహాసభలో పాల్గొని, చారిత్రక ప్రసంగం చేశారు. స్వాతంత్య్రానంతరం 1952లో అంబేద్కర్ సికింద్రాబాద్ను సందర్శించారు. సికింద్రాబాద్లోని పెండర్గాస్ట్ రోడ్డులోని అంబేద్కర్ సమకాలికుడు, అప్పటి పార్లమెంట్ సభ్యుడు జేహెచ్ సుబ్బయ్య ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. చివరిసారిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1953లో హైదరాబాద్ను సందర్శించారు. అప్పుడు అంబేద్కర్కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను అందజేసి, ఆయనను గౌరవించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు ఓయూ గౌరవ డాక్టరేట్ను అందజేసి, సువర్ణాక్షరాలతో చరిత్రను లిఖించిందని పలువురు ప్రొఫెసర్లు తెలిపారు.
నిజాం నవాబుకు డాక్టర్ అంబేద్కర్కు మంచి అనుబంధం ఉన్నది. హైదరాబాద్ రాష్ర్టాన్ని భారత యూనియన్లో కలపాలని కోరిన వారిలో అంబేద్కర్ ఒకరు. మైసూర్, జైపూర్, కశ్మీర్ రాజులతోపాటు నిజాం రాజుకు కూడా జీవితకాలం రాజప్రముఖ్ గుర్తింపు లభిస్తుందని నచ్చచెప్పినవారిలో అంబేద్కర్ కూడా ఉన్నారు. దీంతో అంబేద్కర్ను నిజాం విశ్వసించేవాడు. అంబేద్కర్ రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు లండన్ ప్రయాణ, వసతి ఖర్చులను నిజాం ప్రభుత్వమే భరించింది.
తెలంగాణతో ముఖ్యంగా హైదరాబాద్తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం రాగానే దేశ రాజధానిగా ఢిల్లీని మాత్రమే ప్రతిపాదించినప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు. రెండో రాజధాని గనుక ఉంటే అది హైదరాబాదే అయి ఉండాలని సూచించారు. ఈ విషయాన్ని ‘థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్’ అనే పుస్తకంలో పేర్కొన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ర్టాలను ఏర్పాటు చేయాలని అంబేద్కర్ సూచించారు. ఫజల్ అలీ కమిషన్కు తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైనది. ఆయన రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ఇందుకు ఆలంబనగా నిలిచింది.
అంబేద్కర్ స్మృతిభవనాన్ని మూడంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్ఫ్లోర్లో టాయిలెట్స్, ఏసీ ఔట్డోర్ యూనిట్స్, స్టోర్ రూమ్స్ నిర్మించారు. గ్రౌండ్ఫ్లోర్ లేదంటే మధ్య భాగంలోనే కీలకమైన నిర్మాణాలను చేపట్టారు. ప్రధాన కాన్ఫరెన్స్ హాలు, మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ హాల్ ఏర్పాటు చేశారు. ఇందులో అంబేద్కర్ జీవితంలోని కీలకమైన, మరుపురాని ఘట్టాలకు సంబంధించిన వీడియోలను నిత్యం ప్రదర్శించనున్నారు. ఇదే ఫ్లోర్లో అంబేద్కర్ జీవిత విశేషాలను తెలిపే ఫొటో గ్యాలరీని సైతం ఏర్పాటు చేశారు. పై అంతస్తులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన పీఠం ఉంటుంది. దీనిని సందర్శకులు తిరుగాడేందుకు వీలుగా తీర్చిదిద్దారు.
అంబేద్కర్ స్మృతివనాన్ని 2.93 ఎకరాల్లో తీర్చిదిద్దుతున్నారు. పచ్చదనంతోపాటు రాక్ గార్డెన్, ఫౌంటెయిన్, పూలవనాలు, కాలిబాటలు ఏర్పాటు చేయనున్నారు. టాయిలెట్ బ్లాక్, టికెట్ కౌంటర్, సెక్యూరిటీ రూమ్ నిర్మాణాలు ఉన్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహరీని ఎత్తయిన గ్రిల్స్తో ఏర్పాటు చేశారు.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైనది అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థను తీర్చిదిద్దడంలో మూల పురుషుడు. ఆ భావన ప్రస్ఫుటమయ్యేలా అత్యంత ఎత్త్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న స్మారక భవనాన్ని పార్లమెంట్ భవనం తరహాలో రూపొందించారు. 2,476 చదరపు అడుగుల విస్తీర్ణంలో వృత్తాకారంలో, చుట్టూ భారీ ఎత్తయిన పిల్లర్లతో భవనాన్ని నిర్మించడం విశేషం. ఆకృతిలోనే కాకుండా రూపంలోనూ అదే తరహాలో తీర్చిదిద్దారు. రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా ధోల్పూర్ లేతగోధుమ, ఎరుపు రంగు ఇసుక రాళ్లను తెప్పించారు. పిల్లర్లు, భవన ప్రాంగణానికి మెరుగులు దిద్దారు.
అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా దేశీయంగానే తీర్చిదిద్దడం గర్వకారణం. నోయిడా డిజైన్ అసొసియేట్స్కు అంబేద్కర్ విగ్రహ నిర్మాణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాం వన్జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్ విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు. తొలుత ఉక్కుతో విగ్రహన్ని తీర్చిదిద్ది ఆపై ఇత్తడి తొడుగులను బిగించడం విశేషం. ఇత్తడి విగ్రహం నమూనాలను ఢిల్లీలో పోతపోసి హైదరాబాద్కు తరలించారు. విగ్రహం దాదాపు 3 దశాబ్దాల పాటు మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్ కోటింగ్ వినియోగించారు.
ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా ప్రాజెక్టు కాస్తా జాప్యమైంది. కొవిడ్ వైరస్ భయం సద్దుమణిగిన అనంతరం ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకున్నది. షెడ్యూల్డ్ కుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఆ డిజైన్ బాధ్యతను డిజైన్ అసోసియేట్స్కు అప్పగించింది. ఆ సంస్థ మొత్తంగా రూ.146.50 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ ఆధ్వర్యంలో 2021 జూన్ 3న నిర్మాణ ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు నిర్దేశిత గడువు 2023 ఏప్రిల్ 30 కంటే ముందుగానే పనులు పూర్తి కావడం విశేషం.