హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): అనూహ్యంగా జూలై రెండోవారంలోనే గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తక్షణ రక్షణ చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తిగా అప్రమత్తమైంది. గత కొద్ది రోజులుగా ఎడ తెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు.. ఎగువ నుంచి దిగువకు ఉరకలెత్తిన గోదారమ్మ ఉద్ధృతికి వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగి పొర్లుతున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి సీఎం కార్యాలయమే వార్ రూంగా మారిపోయింది. అధికారులకు, మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు ఒక కంట్రోల్ రూంలా పనిచేస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వీయ పర్యవేక్షణలో 24 గంటలూ వరద నియంత్రణ చర్యలు, సహాయ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి తగిన సూచనలు, ఆదేశాలు వెళ్తున్నాయి. వరద పరిస్థితులను ముందస్తుగానే అంచనా వేసి దార్శనికతతో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకొంటున్నారు. గత మూడు రోజులుగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వానలు.. వరదల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షింస్తుండగా ప్రకృతి విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించేందుకు ఆయన కార్యాలయం 24 గంటలు పనిచేస్తున్నది.
ప్రజా సంక్షేమం పట్ల ఆర్తి ఉన్న సీఎం కేసీఆర్.. గంట గంటకూ అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, నదుల పరిస్థితిపై సమాచారాన్ని తెప్పించుకొంటూ అప్పటికప్పుడే అవసరమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా సున్నితమైన, ముంపు ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణ కేంద్రం హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో రేయింబవళ్లు సీఎం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానికంగానే ఉంటూ తక్షణ సహాయ చర్యలను పర్యవేక్షించేలా అప్రమత్తం చేస్తున్నారు. రోజూ దాదాపు 12 నుంచి 15 గంటల పాటు సీఎం ప్రత్యక్షంగా వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తున్నారు. అవసరమైన చోట వెంటనే తగిన నిధుల విడుదలకు ఆదేశాలిస్తున్నారు. బుధవారం కూడా రాత్రి పొద్దుపోయేవరకు కూడా సమీక్ష నిర్వహించారు. వరదల నేపథ్యంలో రెండురోజులుగా నిరంతరంగా సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్ బుధవారం కూడా ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులకు తక్షణ కార్యాచరణ నిర్దేశించారు.
కడెం ప్రాజెక్టు ముంపు గ్రామాల తరలింపు
కడెం ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతున్నది. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కారణంగా ముంపునకు గురవుతున్న 12 గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. అకడే ఉండి రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని ఫోన్లో సీఎం కేసీఆర్ ఆదేశించారు. నిర్మల్ సహా వరద ముంపునకు గురవుతున్న నదీ పరివాహక పట్టణ ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ను ఆదేశించారు. వరదలకు తెగిపోతున్న జాతీయ , రాష్ట్ర రహదారుల పునరుద్ధరణకు పూనుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు.
గోదావరి నది ఉధృతికి బుధవారం ములుగు జిల్లా మంగపేట పుష్కరఘాట్ వద్ద కోతకు గురైన బీటీ రోడ్డు, నీట మునిగిన పంట పొలాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్ణశాలలో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టండి
రాష్ట్రంలో వర్షాల వల్ల విద్యుత్తు సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, విద్యుత్తు ఉత్పాదనకు మరో నెల రోజులకు సరిపడా బొగ్గును నిల్వచేసుకోవాలని విద్యుత్తు శాఖ సీఎండీలు ప్రభాకర్రావు, రఘుమారెడ్డి, సింగరేణి సీఎండీ శ్రీధర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు 2,300 విద్యుత్తు స్తంభాలు కూలిపోతే 1,600 వరకు పునరుద్ధరించామని, మిగతా పనులు పురోగతిలో ఉన్నాయని, విద్యుత్తుకు అంతరాయం ఏర్పడ్డచోట తక్షణమే ప్రత్యామ్నాయ చర్యల ద్వారా పునురుద్ధరిస్తున్నట్టు సీఎండీ ప్రభాకర్రావు సీఎంకు వివరించారు.
హైడల్ ప్రాజెక్టులను ప్రారంభించండి
ప్రాజెక్టులకు విపరీతంగా వరద చేరుకొంటున్న నేపథ్యంలో, అవకాశమున్న చోటల్లా హైడల్ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించాలని సీఎం అన్నారు. వరదల వల్ల పురోగతిలో వున్న దేవాదుల ప్రాజెక్టుల పనులకు అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి తలెత్తిందని అధికారులు సీఎంకు వివరించారు. వరద నీటిని ఎత్తిపోసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఈఎన్సీ మురళీధర్రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.
నిధులు విడుదలచేయాలి
వానలు, వరదల నేపథ్యంలో చేపట్టిన చర్యలకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు విడుదలచేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరదల వల్ల తలెత్తుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎస్, డీజీపీకి సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమీక్షా సమావేశం నుంచే వరద ముంపు అధికంగా ఉన్న జిల్లాల్లోని మంత్రులు, కలెక్టర్లు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులకు ఫోన్లో మార్గదర్శనం చేశారు. పరిస్థితులు చకబడేవరకు వారివారి నియోజకవర్గాలు, జిల్లాలు విడిచి వెళ్ళరాదని సంబంధిత జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
సెలవులు పొడిగింపు
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ఇప్పటికే ప్రకటించిన సెలవులను 16 తేదీ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు సత్యవతి రాథోడ్, నిరంజన్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కాలేరు వెంకటేశ్, హర్షవర్ధన్రెడ్డి, ఉపేందర్రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, సీఎంవో ఉన్నతాధికారులు, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, విద్యుత్తు, రోడ్లు, భవనాలశాఖ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫోన్లో ఆదేశాలు
ఎగువన భారీ వానల నేపథ్యంలో కృష్ణా, గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సారెస్పీ వంటి రిజర్వాయర్ల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోల గురించి సీఎం ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలపై ఆరా తీశారు. మహారాష్ట్రలో ఎగువ గోదావరి నుంచి వస్తున్న వరదను అంచనా వేసి చేపట్టాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలిచ్చారు. వరదల వల్ల రవాణా, విద్యుత్తు తదితర సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీంలు, హెలికాప్టర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.
భద్రాచలంలో అలర్ట్
భద్రాచలంలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను అకడే ఉండి రక్షణ చర్యలను పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని, చెరువులకు గండ్లు పడుతున్న పరిస్థితి గురించి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో సీఎం సమీక్షించారు. వరదలు తగ్గగానే.. కావాల్సిన విత్తనాలు ఎరువులను అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.