నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 12: తెలంగాణను సాకారం చేసిన సీఎం కేసీఆర్ విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూనే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీలు జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి కొనియాడారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ జిల్లా కమిటీ ఎన్నికల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకే పాఠశాలలో హేతుబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. దీన్ని కొన్ని సంఘాలు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. విద్యారంగ సమస్యలను ఎప్పుడు సీఎం దృష్టికి తీసుకొచ్చినా ఆయన సానుకూలంగా స్పందించినట్టు గుర్తుచేశారు. పీఆర్టీయూ విజ్ఞప్తి మేరకు కేసీఆర్ ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.