హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ప్రజావ్యతిరేక విధానాలు, సమాజాన్ని చీల్చిచెండాడే విద్వేష విధానాలపై పోరాటం చేయాల్సి ఉన్నదని సీఎం కేసీఆర్ సూచించారు. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. మునుగోడు నియోజకవర్గం ఒకనాడు ఫ్లోరైడ్ నీళ్లతోని.. నడుములు వంగిపోయి. ఏవిధంగా బాధపడ్డదో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ కన్నా ముందు.. కేసీఆర్ కన్నా దొడ్డు. కేసీఆర్ కన్నా ఎత్తున్నోళ్లు ఎంతో మంది ముఖ్యమంత్రులయ్యిండ్రు. ఇదే జిల్లా బిడ్డ దుశ్చ ర్ల సత్యనారాయణ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి జలసాధన పోరాటం చేసి అంశాల (అంశుల) స్వామి అనే వ్యక్తిని తీసుకెళ్లి.. అనాటి ప్రధాని టేబుల్ మీద పండుకోబెట్టి ఆయ్య మా బ్రతుకు ఇది అంటే ఎవ్వరూ మొర వినలే. నేనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్రమంతటా మీ బాధ గురించి చెప్తూ వచ్చిన. అంశాల స్వామి కావచ్చు, ఫ్లోరైడ్ బాధితులు కావొచ్చు.
దేశం నుంచి, విదేశాల నుంచి ఎవలెవలో వచ్చి చూస్తుంటే అంతా నిరసనను, బాధను వ్యక్తంచేశారు. మేమేమన్నా ప్రదర్శన వస్తువులమా? మాటిమాటికి వచ్చి అవమాన పరుస్తుంటే.. మీరు దయచేసి రాకండి.. దమ్ముంటే సమస్య ను పరిష్కరించాల ని తిట్టి పంపించా రు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నల్లగొం డ నగారా పేరుతో 15 రోజులపాటు జిల్లా లో పర్యటించినం. శివన్నగూడెంలో నిద్రకూడా చేసి న. ఏమాయెనే నల్లగొండ అన్న మాట చెప్పినం. మనందరి పోరాట ఫలితంగా మన తెలంగాణ మనకు వస్తే.. ఫ్లోరైడ్ రహిత మునుగోడుగా, ఫ్లోరైడ్ రహి త నల్లగొండగా మార్చుకున్నం. మిషన భగీరథ సత్యం మీ కండ్ల మీదే ఉన్నది.’
ఆగమాగం కావొద్దు..
ఎలక్షన్ రాంగనే ఆగమాగం కావొద్దు. మన చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరికో అప్పజెప్పి ఎవన్నో పోరాటం చేయమంటే చేయరు. సీరియస్గా ఆలోచన చేయాలె. ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక్క ఆయుధం ఓటు. దాని ద్వారా నిర్మాణం అయ్యే శక్తి మనకు ఉపయోగపడుతదా? లేదా? అన్న ది ఆలోచన చేయాలె. ప్రజావ్యతిరేక విధానాలకు, సమాజాన్ని చీల్చిచెండాడే విద్వేష విధానాలపై పోరాటం జరగాల్సి ఉన్నది. ఇదే అంశంపై నేను జాతీయ, రాష్ట్రస్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు, ఇతర పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నా. ఏం జేయాలె? ఎట్ల ముందుకుపోవాలె? ఏ దారి పట్టాలె. దేశాన్ని.. ప్రజలను ఎట్ల కాపాడుకోవాలె? అని ఐదారు మాసాలు గా తలకాయంతా పగులగొట్టుకుంటున్నా.
ఇక్కడ ఏ విధంగా ఏరాపేరి గోల్మాల్ ఉపఎన్నిక వచ్చిందో మీకు తెలుసు. ఏం అక్కరుందని ఉప ఎన్నిక వచ్చింది? ఇంకో ఏడాదైతే ఎలక్షనే ఉండే. నడుమల ఈ ఎలక్షన్ ఎవరి సంక్షేమం కోరి?ఎర్రటి ఎండల మిమ్మల్ని నిలబెట్టాల్సిన అవసరమేంది? దీని వెనుకున్న మాయామశ్చీంద్రమేంది? గుర్తుపట్టకపోతే దెబ్బతినే ప్రమాదముంటది. సీపీఐ, సీపీఎం నేతలతో నేను ఒక్క టే మాట చెప్పిన.. రాష్ట్రంల దేశవ్యాప్తంగా ప్రగతిశీల, క్రియాశీల శక్తులన్నీ ఏకం కావా లె. ఈ దుర్మార్గులను పంపాలె. అప్పుడే ప్రజలు, దేశం బాగుపడుతదని అభిప్రాయాలు పంచుకున్నం. నిన్నా మొన్న చర్చలు చేసినం. దేశం జీవితమే దెబ్బతినే ప్రమాదముంది కాబట్టి క్రియాశీల, ప్రగతిశీల శక్తులన్నీ ఏకం కావాలని సీపీఐ ఉన్నతస్థాయిలో చర్చించిన తర్వాత మునుగోడులో పోటీచేయండా టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇం దుకు సీపీఐ పార్టీకి, నేతలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నా.
నో మ్యాన్ జోన్ అయితదని చెప్పినా.. పట్టించుకోలే
సరైన ప్రయత్నాలు జరగకుంటే నల్లగొండ జిల్లా మానవ నివాసయోగ్యం కాకుండాపోతది. నో మ్యాన్ జోన్ అయితదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇక్కడ మనుషులు నివసించలేరు. ఇక్కడ మంచినీళ్లు పైపుల ద్వారా ఇయ్యాలె. శుద్ధిచేసిన నీళ్లు ఇయ్యాలె. పొలాలు, పండే పంటలు, కల్లు ఇచ్చే తాటిచెట్లకు ఫ్లోరైడ్ ఎక్కుతాంది. ఈ పంటలు తింటే ప్రమాదమే. నో మ్యాన్ జోన్ అయితదని చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినా ఆనాడు రాష్ట్రపాలకులు, దేశ పాలకులు మన బాధ పట్టించుకోలె. మంచినీళ్లయితే కింద మీద బడి తెచ్చుకున్నం. కొంత బాధ పోయింది. ఇక సాగునీళ్లు రావాలె. నల్లగొండ జిల్లా ఉండేదే కృష్ణబేసిన్లో. మన డిండి ద్వారా శివన్నగూడెం ప్రాజెక్ట్ ద్వారా రావాలె. శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా తీసుకోవాలె. దాని కోసం ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాం.