Gaddar | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ)/నాంపల్లి/కంటోన్మెంట్/మల్కాజిగిరి: మూగబోయిన గొంతులో రాగమెవరూ తీసెదరో.. జీరబోయిన గొంతులో జీవమెవరూ పోసెదరో.. ఆ చిన్నబోయిన సేతికర్రతో సాము ఎవరూ సెసదరో.. ఆ తెగిపోయిన వీణ తీగలను నరాలెవరూ అల్లెదరో.. ఆ తుపాకులకు ఎదురు నడ్సిన తూట ఎవరూ దాసెదరో.. జానపదం జీవకణంలో జీవాక్షరాలెవరో.. అంటూ వాగ్గేయకారుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. గద్దర్ ఇక లేరనే విషయం తెలిసి యావత్తు తెలంగాణవాదులు నివాళి అర్పించారు. ప్రాంతాలకతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. అశేష జనసంద్రం నడుమ ఆశ్రు నయనాలతో అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన మరణించారని తెలియగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ యంత్రాంగమే అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఆదివారం దవాఖాన నుంచి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంకు తరలించగా, సోమవారం అక్కడి నుంచి అంతిమయాత్రగా అల్వాల్లోని మహాబోధి విద్యాలయానికి తరలించారు. అల్వాల్లోని గద్దర్ ఇంటికి పార్థివదేహం చేరుకోగా, భారీ సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులు, కళాకారులు కుటుంబసభ్యులను ఓదారుస్తూ యుద్ధనౌక.. సెలవిక.. జోహార్ గద్దరన్న అంటూ నివాళి అర్పించారు. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యేలతో కలిసి గద్దర్ ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్ నివాళి అర్పించి, కొడుకు సూర్యం, సతీమణి, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్తూ ఓదార్చారు. అనంతరం పార్థివదేహాన్ని మహాబోధి విద్యాలయానికి తీసుకెళ్లారు. బౌద్ధ సంప్రదాయాలతో చివరి అంతిమ సంస్కారాలు నిర్వహించాక, పోలీసుల గౌరవ వందనం తర్వాత రాత్రి 8.02 గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు.
6 గంటలపాటు అంతిమ యాత్ర
ఎల్బీ స్టేడియం నుంచి సోమవారం ఉదయం 11 గంటల అనంతరం అంతిమయాత్ర ప్రారంభమవగా, ట్యాంక్బండ్ మీదుగా 17 కిలోమీటర్లు 6 గంటలపాటు సాగి మహాబోధి విద్యాలయం వరకు చేరుకున్నది. ఎల్బీ స్టేడియానికి దారితీసే రోడ్లన్నింటినీ పోలీసులు భారీకేడ్లు వేసి నియంత్రించగా.. అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతతో అంతిమయాత్రకు ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియం నుంచి అంతిమయాత్ర ప్రారంభించగా, మొదట గన్పార్క్లోని అమరవీరుల స్థూపం, నెక్లెస్ రోడ్డులోని బాబూ జగ్జీవన్రామ్, ట్యాంక్బండ్, రాణిగంజ్, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, లాల్బజార్, సుభాష్నగర్ మీదుగా అల్వాల్ వెంకటాపురం భూదేవినగర్లోని ఆయన స్వగృహం వరకు సాగింది. ఆయన పార్థివదేహాన్ని చూడగానే నాయకులు, ప్రజలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.
బౌద్ధ సంప్రదాయంలో అంత్యక్రియలు
కుటుంబసభ్యులు, అభిమానులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో బౌద్ధ సంప్రదాయంలో గద్దర్ పార్థివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఓవైపు బౌద్ధ మత పెద్దలు అంత్యక్రియలు సమయానుకూలంగా జరిపేందుక ఏర్పాట్లు చేయగా.. చివరి చూపు కోసం భారీగా వచ్చిన జనాలతో కొంత జాప్యం జరిగింది. కుటుంబసభ్యుల వెంటే ఉన్న పైడి జయరాజ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, క్రాంతికిరణ్, కార్పొరేషన్ చైర్మన్లు గజ్జెల నగేశ్, క్రిశాంక్తోపాటు పలు పార్టీల నేతలు, సామాజిక, దళిత నాయకులు ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించారు.
పార్టీలకతీతంగా నేతల హాజరు
తన పాటలతో ఉద్యమాలకు ఊపిరిపోసిన గద్దర్ చివరి చూపు కోసం పార్టీలకతీతంగా నేతలు హాజరయ్యారు. మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్రెడ్డి, మల్లు రవి, వీహనుమంతరావు, భట్టివిక్రమార్క, ప్రొఫెసర్ కాశీం, ఘంటా చక్రపాణి, విమలక్క, మొగులయ్య, బీ నర్సింగరావు, దళిత సంఘాలు, ప్రజా కళామండలి, నాట్యమండలి, దళిత సాంస్కృతిక మండలి నాయకులు, కవులు, కళాకారులు, సినీనటుడు ఆర్ నారాయణమూర్తి ఆశ్రునయనాలతో నివాళి అర్పించారు.
సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ హఠాన్మరణం
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి: గద్దర్ అంతిమయాత్రలో పాల్గొన్న అనంతరం ఆయన స్నేహితుడు, సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం ఎల్బీస్టేడియం నుంచి అల్వాల్లోని భూదేవీనగర్ వరకు సాగిన గద్దర్ అంతిమయాత్రలో జహీరుద్దీన్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు. భూదేవీనగర్లోని గద్దర్ ఇంటి సమీపంలో ఛాతిలో నొప్పి రావడంతో ఆయన రోడ్డు పక్కనే పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అలీఖాన్ మృతికి గుండెపోటు కారణమై ఉంటుందని డాక్టర్లు పేర్కొన్నారు. గద్దర్, జహీరుద్దీన్ అలీఖాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సీఎం సంతాపం
జహీరుద్దీన్ అలీఖాన్ మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మంత్రులు కేటీఆర్, మహమూద్అలీ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రికా ప్రపంచానికి తీరనిలోటని పేర్కొన్నారు. పత్రికా సంపాదకుడిగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్ర, వారి సేవలను సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలీఖాన్ మృతి పట్ల మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన నిర్వహించిన పాత్ర ప్రత్యేకమైనదని, లౌకికవాదానికి కట్టుబడ్డ అభ్యుదయవాది అని పేర్కొన్నారు.
యావత్ మానవాళికి తీరనిలోటు
గద్దర్ మరణం యావత్ మానవాళికి తీరనిలోటు. ప్రజల ఆవేశం, ఆవేదన, ఆరాటం, ఆక్రోశమే గద్దర్ జీవితం. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’ అనే పాటను నేను అడగంగానే మానవీయకోణంలో ఇచ్చారు. ఇందుకు ఏమీ ఆశించని గొప్ప మానవీయకోణం గల మహాకవి గద్దర్. ఆయన కోరుకున్న పీడిత ప్రజల రాజ్యం రావాలని కోరుకుందాం. ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం గొప్పవిషయం.
– ఆర్ నారాయణమూర్తి
పీడిత ప్రజలను చైతన్యం చేసిన గద్దర్
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) గద్దర్ ఆకాల మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని, ఎంతో ఆవేదన కలిగిందంటూ ఆయన కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. నక్సల్బరి, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాల నేపథ్యంలో పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచారని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం లేఖ విడుదల చేశారు. నాటి పాలకుల దోపిడీని పాటల రూపంలో ఎండగట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేశారని పేర్కొన్నారు. నాటి పాలకవర్గమైన టీడీపీ, చంద్రబాబు హయాంలో విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో ‘నల్ల దండు ముఠా’లను పోలీసుల ద్వారా ఏర్పరచి, అనేక మంది విప్లవకారులను క్రూరంగా హత్యలు చేయించారని తెలిపారు. ఇందులో భాగంగానే 1997లో గద్దర్పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కాల్పులు జరుపగా, ఐదు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లి ప్రాణాప్రాయ స్థితి నుంచి బయటపడ్డారని జగన్ నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.
గద్దరన్న తెలంగాణకు స్ఫూర్తి
గద్దరన్న తెలంగాణ రాష్ర్టాన్ని, ప్రజలను 50 ఏండ్లపాటు తన గొంతు, పాట, మాటలతో నడిపించిన యోధుడు. ఆయన పాటలు విని, స్ఫూర్తి పొందారు. మా లాంటి అనేక మంది అనగారిన, పేదవర్గాలు, కుల, మతాలకు అతీతంగా యువత చైతన్యమయ్యాం. తెలంగాణలో నూతన సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో కోట్లాది మంది ప్రజలు కదిలారు. తెలంగాణ ఉద్యమంలోకి గద్దరన్న రావడంతో కొత్తమలుపు తిరిగింది. రాష్ట్ర సాధనలో కీలకంగా మారారు. జీవితాంతం పేదల విముక్తి కోసం పనిచేశారు. ఆయన మృతి తెలంగాణ సమాజానికి తీరనిలోటు.
– ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి