హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 29న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సభా స్థలం కోసం ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డితో కలిసి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ స్థల పరిశీలన చేశారు. లక్ష మందితో సభ నిర్వహించనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మంత్రుల వెంట ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, కలెక్టర్ సంగీత, సీపీ సత్యనారాయణ, డీసీపీలు రూపేష్, అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, దీపక్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్ కుమార్తో పాటు సిబ్బంది ఉన్నారు.