హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం ముంబైకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లి, ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన నివాసంలో భేటీకానున్నారు. సీఎం కేసీఆర్ను ఇటీవల ఉద్ధవ్ ఠాక్రే ముంబైకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు.
ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నది. భేటీ అనంతరం సీఎం కేసీఆర్ బృందం ఠాకే అధికారిక నివాసం వర్షాలోనే భోజనాలు పూర్తి చేసుకొని.. ఆ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసానికి వెళ్లనున్నారు. జాతీయ రాజకీయ అంశాలపై ఆయనతోనూ చర్చించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.