CM KCR | సిద్దిపేట, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు సూచన మేరకు స్థానిక నేతలు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో గ్రామస్థులు ఆయనను ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు.. మధ్యలో యాగం, సమయాభావ పరిస్థితులతో ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నారు.తన నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. ఈ నెల 9న గజ్వేల్తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదేరోజు బీఆర్ఎస్ ఆశీర్వాదసభల్లో పాల్గొననున్నారు.
కోనాయిపల్లి వేంకటేశ్వరాయలయం సీఎం కేసీఆర్, పార్టీకి సెంటిమెంట్గా ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్క డ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ నామినేషన్ వే స్తారు. సీఎం కేసీఆర్, హరీశ్రావు , ఇతర పార్టీ నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకొని స్వా మివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ దేవాలయ ముఖద్వారం దక్షణం వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. కాగా, పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ సూచనలతో మంత్రి హరీశ్రావు దేవాలయాన్ని రూ. 3 కోట్ల పైగా నిధులు వెచ్చించి గుడి పునర్నిర్మించారు.
కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కేసీఆర్కు విజయం వరించింది. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు. మరో విశేషం ఏమిటంటే, 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు.