ఎనిమిదేండ్లలోనే 12 కొత్త కాలేజీలు వచ్చాయి. 33 జిల్లాల్లోనూ ఏర్పాటుచేస్తాం అప్పుడు రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వైద్య విద్యకోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రంలోనే సరిపడా సీట్లుంటాయి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్య రంగంలో నూతన విప్లవం.. దేశ చరిత్రలోనే ఒక అరుదైన సందర్భం.. ఒకేసారి ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాబోతున్న శుభసమయం.. ఎనిమిదేండ్లలో ఎన్నో సంచలనాలు సృష్టించిన తెలంగాణ, మరో చారిత్రక ఘట్టానికి కూడా వేదిక కాబోతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఎనిమిది వైద్య కళాశాలల్లో మంగళవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతిభవన్ నుంచి వర్చువల్గా ఒకేసారి తరగతులను ప్రారంభించనున్నారు. దీంతో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్ కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ కలను సాకారం చేసే దిశగా అతిపెద్ద అడుగు పడబోతున్నది. ఈ 8 కాలేజీలతో అదనంగా 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
నాడు వైద్యం లేదు.. వైద్య విద్య లేదు
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల సంఖ్య 5 మాత్రమే. ఇందులో గాంధీ (1954), ఉస్మానియా (1946) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించేనాటికే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్లో రిమ్స్, నిజామాబాద్లో మరో వైద్య కళాశాలను మాత్రమే ఏర్పాటుచేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు మంచి వైద్యం, వైద్య విద్య అందని ద్రాక్షగా మారాయి. ఏదైనా పెద్ద వ్యాధి వచ్చినా, మెరుగైన వైద్యం పొందాలన్నా హైదరాబాద్కు పరిగెత్తాల్సిన దుస్థితి. వందల కిలోమీటర్ల దూరం.. గంటలపాటు ప్రయాణం చేయాల్సి వచ్చేది. అంత ప్రయాసపడి వచ్చినా.. చికిత్స కోసం వారాలు, నెలలపాటు అకడే ఉండాల్సిన పరిస్థితి. సరైన వసతులు లేక సహాయకులు అష్టకష్టాలుపడేవారు. దీంతో కుటుంబాలు ఆగమయ్యేవి. మరోవైపు.. ఐదు కాలేజీల్లో కలిపి 850 సీట్లు మాత్రమే ఉండేవి. దీంతో మెడిసిన్ చదువాలనుకున్న ఎంతోమంది విద్యార్థులు తమ కలలకు దూరమయ్యేవారు. మరికొందరు విదేశాలకు వెళ్లి రూ.లక్షలు ఖర్చు పెట్టి అప్పులపాలయ్యారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యం
ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలు వైద్యం కోసం పడుతున్న కష్టాలను కండ్లారా చూశా రు. స్వరాష్ట్రం ఏర్పడిన వెంటనే సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయాలని నిర్ణయించుకొన్నారు. ఇందుకోసం జిల్లా కు ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మొదటి దశలో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుటా ్టరు. మహబూబ్నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ఏర్పాటుచేశారు. రెండో దశలో సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం), నాగర్కర్నూలు, రామగుండం (మంచిర్యాల)లో కాలేజీలను ఏర్పాటుచేశారు. ఎనిమిదేండ్లలోనే కాలేజీల సంఖ్య మూడున్నర రెట్లు పెరిగింది. ఉమ్మడి పాలనలో 57 ఏండ్లలో ప్రభుత్వాలన్నీ కలిపి తెలంగాణలో ఏర్పాటు చేసినవి మూడు కాలేజీలే. అంటే.. సగటున 19 ఏండ్లకు ఒక కాలేజీని ఏర్పాటు చేస్తే.. సీఎం కేసీఆర్ పాలనలో ఎనిమిదేండ్లలోనే 12 కాలేజీలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది 9, ఆ పై ఏడాది మరో 8 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటుచేయనున్నది. దీంతో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కానున్నది.
1) మంచి వైద్యం:
మెడికల్ కాలేజీలో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలు, అత్యాధునిక పరికరాలు ఉంటాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు, సీనియర్ రెసిండెంట్లు.. ఇలా భారీగా సిబ్బంది ఉంటారు. దీంతో ప్రజలకు మంచి వైద్యం అందుబాటులోకి వస్తుంది. పెద్ద వ్యాధి వచ్చినా హైదరాబాద్ వరకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే చికిత్స లభిస్తుంది. జిల్లాల వికేంద్రీకరణ నేపథ్యంలో మారుమూల గ్రామాలకు సైతం జిల్లా కేంద్రాలు గరిష్ఠంగా 50-70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. కాబట్టి అత్యవసర సమయాల్లో తొందరగా పెద్ద దవాఖానకు చేరుకోవచ్చు.
2) కలలు సాకారం
ఎంబీబీఎస్ సీట్లు 2014లో 850 ఉండగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో 2,790కి చేరింది. అంటే ఎనిమిదేండ్లలో మూడు రెట్లు పెరిగాయి. పీజీ సీట్లు డబుల్ అయ్యి 531 నుంచి 1,122 కు పెరిగాయి. సూపర్ స్పెషాలిటీ సీట్లు సైతం 76 ఉండగా రెట్టింపయ్యి 152కు చేరుకున్నాయి. దీంతో రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకొనే అవకాశాలు పెరిగాయి. డబ్బు ఖర్చు చేసుకొని విదేశాలకు వెళ్లే అవస్థ తప్పుతుంది. ఉక్రెయిన్ వంటి విపత్తుల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగి రావడం, చదువును కొనసాగించడానికి నానా కష్టాలు పడాల్సిన దుస్థితి తప్పుతుంది. హాయిగా సొంత రాష్ట్రంలోనే ఉంటూ ఉచితంగా తమ కలలను నెరవేర్చుకోవచ్చు.
3) కాలేజీలు.. ఆర్థిక కేంద్రాలు
మెడికల్ కాలేజీ అంటే కేవలం విద్యాసంస్థ మాత్రమే కాదు. అనుబంధంగా అనేక వసతులు ఏర్పడుతాయి. ఆ ప్రాంతం ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుంది. కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. వీటిల్లో పనిచేయడానికి భారీగా సిబ్బంది అవసరం ఉంటారు. దీంతో స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పెరుగుతుంది. విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది, హాస్పిటల్కు వచ్చే రోగులు, సహాయకులు.. వారికోసం రవాణా, వసతి సదుపాయాలు.. ఇలా ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి అభివృద్ధి చెందుతుంది
ప్రతి జిల్లాకు ఒక కాలేజీ
తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. ఎనిమిదేండ్లలోనే 12 కొత్త కాలేజీలు ఏర్పాటు చేసుకొన్నాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున 33 జిల్లాలకు కాలేజీలు వస్తాయి. అప్పుడు రాష్ట్రంలో 10 వేల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మన విద్యార్థులు వైద్య విద్యకోసం రష్యా, చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రాష్ట్రంలోనే చదివేందుకు సరిపడా సీట్లు ఉంటాయి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
దేశ చరిత్రలోనే తొలిసారి
ఒక రాష్ట్రంలో ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కావడం, పిల్లలకు 1,150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావడం దేశ చరిత్రలోనే బహుశా తొలిసారి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ 8 కాలేజీల నిర్మాణానికి కృషి చేసిన హెల్త్ సెక్రటరీ, డీఎంఈ, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఇతర అధికారులకు ప్రత్యేక అభినందనలు..
– టీ హరీశ్రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి