CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తూ.. పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada sabha) పాల్గొంటూ తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో కోదాడకు బయల్దేరుతారు. 1.40 గంటలకు కోదాడకు చేరుకుంటారు. అంనతరం ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు.
సభ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు కోదాడ నుంచి తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి బయల్దేరుతారు. 3.10 గంటలకు తిరుమల గిరి చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4.10 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు చేరుకుంటారు. 4.20 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మూడు నియోజకవర్గాల్లో సభా ఏర్పాట్లను పార్టీ నాయకులు ఇప్పటికే పూర్తిచేశారు. కోదాడ, తిరుమలగిరి, ఆలేరు పట్టణాలు గులాబీ మయమయ్యాయి. ప్రజా ఆశీర్వాద సభలకు పెద్దఎత్తున ప్రజలు తరలిరానున్నారు.