హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో (PRLIS) భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రారంభించనున్నారు. దీంతో సమైక్య పాలకుల వివక్షతో కరువుసీమగా మారిన పాలమూరు గడ్డపై నేడు అపూర్వ జలదృశ్యం ఆవిష్కృ తం కానుంది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల సాగునీటి గోసను శాశ్వతంగా తీర్చేందుకు కృష్ణమ్మ బిరబిరా తరలిరానున్నది. దశాబ్దాల కల నెరవేరుతుండటంతో పాలమూరు ప్రజలు అనందంలో మునిగి తేలుతున్నారు. సీఎం కేసీఆర్ పర్యటణ నేపథ్యంలో కొల్లాపూర్ పట్టణం బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది.
మరికాసేపట్లో హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన నాగర్ కర్నూల్కు సీఎం కేసీఆర్ బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు తేజ గార్డెన్స్కు చేరుకోని.. అక్కడే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2:30కు తేజ గార్డెన్ నుంచి రోడ్డు మార్గాన మూడున్నరకు నార్లాపూర్ కంట్రోల్ రూమ్కు చేరుకుంటారు. అనంతరం కంట్రోల్ రూమ్లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్ చేస్తారు. సాయంత్రం 4 గంటలకు నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు కోల్లాపూర్లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తిరిగి ప్రగతి భవన్కు చేరుకుంటారు.
కాగా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని (పీఆర్ఎల్ఐఎస్)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్కర్నూల్ జిల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా.. కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకొన్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్కర్నూల్, మహబూబ్నగర్, కొడంగల్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు.
పంపింగ్ మోటర్లను సీఎం కేసీఆర్ ఆన్చేసి, కృష్ణా జలాలను దుంకించిన మరుక్షణం.. ఆ జలాలను కలశాలలో నింపుకొని ప్రతి ఊరిలోని ఆలయాల్లో ఉన్న దేవుళ్లకు జలాభిషేకం చేయనున్నారు. సీఎం కేసీఆర్ నార్లాపూర్ పంప్హౌస్ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి పట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు.