Nirmal | నిర్మల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ వేళ్లూనుకొంటున్నది. పాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో సమీకృత కలెక్టరేట్ సముదాయం ముస్తాబైంది. ఈ కొత్త పరిపాలనా సౌధాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ప్రారంభించనున్నారు. జిల్లాలో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుండగా, విద్య, వైద్యం కొత్త హంగులు సంతరించుకొంటున్నాయి.
ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత చేరువ చేయటమే లక్ష్యంగా అన్ని జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ భవనం నిర్మాణానికి రూ.56 కోట్లు కేటాయించింది. జిల్లాలో కొత్తగా 156 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 18 మండలాలుండగా, వీటిలో కొత్తగా 5 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 738 చెరువులుండగా, మిషన్ కాకతీయ ద్వారా 429 చెరువులను పునరుద్ధరించారు. వీటి కింద దాదాపు 54,541 ఎకరాల అదనపు ఆయకట్టు పెరిగింది. రైతులకు సాగు నీటి తిప్పలు తప్పాయి.
కొత్తగా నిర్మించిన చెక్డ్యాంలు, ఎత్తిపోతల పథకాలతోపాటు, సాగు నీటి కాలువల మరమ్మతుల కారణంగా జిల్లాలో సాగు విస్తీర్ణం దాదాపు 1.10 లక్షల ఎకరాలు పెరిగింది. దీంతో పంటల దిగుబడి 2,23,000 మెట్రిక్ టన్నులు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కేవలం 3.30 లక్షల ఎకరాలు సాగుబడిలో ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రస్తుతం 4.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. రైతులు తమ పంట గింజలను నిల్వ చేసుకొనేందుకు ప్రభుత్వం అన్ని మండలాల్లో గోదాముల నిర్మాణం చేపట్టింది. ఇందుకోసం రూ.42 కోట్లు ఖర్చు చేసింది. జిల్లాలో రూ.597.62 కోట్ల అంచనాతో ప్రారంభించిన సదర్మాట్ బరాజ్ పనులు చివరి దశకు చేరుకొన్నాయి.
ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.474 కోట్లు ఖర్చు చేశారు. రూ.57 కోట్ల నిధులతో జిల్లావ్యాప్తంగా 25 చెక్డ్యాంల నిర్మాణం చేపట్టారు. లోకేశ్వరం మండలంలోని పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.59 కోట్లు కేటాయించింది. కడెం మండలం లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి రూ.41 కోట్లు కేటాయించింది. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్ తదితర ప్రధాన పట్టణాలతోపాటు 692 గ్రామాల ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందిస్తున్నారు. జిల్లాలో పంచాయతీలు, తండాలు, గూడేలు.. ఇలా మొత్తం 708 గ్రామాలున్నాయి. కొన్ని మారుమూల కొండ ప్రాంతాలు మినహా దాదాపు అన్ని గ్రామాలకు శుద్ధమైన భగీరథ నీరు అందుతున్నది.
నిర్మల్లో నిర్మాణం పూర్తయిన 1,460 డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేశారు. ఖానాపూర్ పట్టణంలో 400, భైంసాలో 200 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 2,411 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయింది. పట్టణ ప్రాంతాల్లో 2,060, గ్రామీణ ప్రాంతాల్లో 156 ఇండ్ల నిర్మాణం పూర్తిచేసి పంపిణీకి సిద్ధంగా ఉంచారు. వీటిలో నిర్మల్ అర్బన్ పరిధిలో 1,460, ఖానాపూర్లో 400 ఇండ్లు, భైంసాలో 200 ఇండ్లతో పాటు గ్రామీణ ప్రాంతాలైన తిమ్మాపూర్లో 16, కడ్తాల్లో 50, గంజాల్లో 40, పాక్పట్లలో 50 ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
జిల్లాలో రైతుల కోసం సకల సౌకర్యాలతో ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించింది. ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించింది. ప్రతి మంగళ, శుక్రవారం రైతు వేదికల్లో రైతులతో వ్యవసాయ అధికారులు సమావేశాలను నిర్వహించి, వ్యవసాయంలో అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జిల్లాలోని 79 క్లస్టర్ల పరిధిలో 79 రైతు వేదికలు ఉన్నాయి. ఆయా వేదికల ద్వారా రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నారు.
నిర్మల్ జిల్లాలోని 735 ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.81.86 కోట్లు మంజూరు చేసింది. మైనార్టీ విద్యా సంస్థలకు భారీగా నిధులు కేటాయించడమే కాకుండా, కొత్త విద్యాసంస్థల ఏర్పాటుకు నడుం బిగించింది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న చించోలి వద్ద ప్రస్తుతం రూ.50 కోట్లతో మైనార్టీ ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మాణం చేపట్టింది. ఇక్కడ ప్రస్తుతం బాలురు, బాలికలకు వేరువేరుగా హాస్టళ్లతోపాటు హైస్కూల్, ఇంటర్మీడియట్ స్థాయి విద్యనందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్లో బాలికలకు, భైంసా, ఖానాపూర్లో బాలురకు, ముధోల్లో బాలికలు, బాలురకు విద్యాంసంస్థలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.
నిర్మల్ జిల్లా ఏర్పడక ముందు నిర్మల్లోని ఏరియా దవాఖానలో 50 పడకలు మాత్రమే ఉండేవి. జిల్లా ఏర్పడిన తర్వాత దీనిని జిల్లా దవాఖానగా అభివృద్ధి చేశారు. అదనంగా మెడికల్ కాలేజీ సైతం మంజూరు కావడంతో ప్రస్తుతం 350 పడకలు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద సంఖ్యలో వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించడంతో ఇక్కడి ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో టీ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా ఎంతో విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడేవారి కోసం డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. సీటీ స్కానింగ్, టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇలా జిల్లా వైద్య రంగంలో అనేక మార్పులు వచ్చాయి.