నాగ్పూర్: మహారాష్ట్రలో (Maharashtra) గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నది. మరఠ్వాడాలో పార్టీ విస్తరణపై దృష్టిసారించిన బీఆర్ఎస్ (BRS) అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR).. నేడు నాగ్పూర్లో (Nagpur) పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నాగ్పూర్ మొత్తం గులాబీ మయమైంది. పట్టణమంతా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, జెండాలతో నిండిపోయింది. ఎక్కడ చూసిన సీఎం కేసీఆర్ ముఖచిత్రంతో కూడిన ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ (Abki Baar Kisan Sarkar) హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. కాగా, పట్టణంలోని గాంధీబాగ్లో విశాలమైన స్థలంలో నిర్మించిన మహారాష్ట్ర బీఆర్ఎస్భవన్ను పార్టీ నాయకులు సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు.
తమ రాష్ట్రంలోనూ తెలంగాణ మాడల్ను అమలు చేయాలని అక్కడి రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఐదు నెలల స్వల్ప కాలంలోనే మహారాష్ట్ర రాజకీయాలను, ఏక్నాథ్ షిండే సర్కార్ను బీఆర్ఎస్ కకావికలం చేస్తున్నది. సీఎం కేసీఆర్ నాందేడ్లో నిర్వహించిన చిన్న సమావేశానికే అక్కడి సర్కార్ దిగొచ్చింది. రైతుబంధు తరహాలో రైతులకు సంవత్సరానికి ఎకరాకు రూ.6 వేలు పంటపెట్టుబడి సహాయంగా అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించింది. మహారాష్ట్రలో గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా విస్తృత నెట్వర్క్ ఉన్న శంభాజీ బ్రిగేడ్తోపాటు ఆ రాష్ట్రంలోని దాదాపు అన్ని షేత్కరీ సంఘటన్లు, పలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్లో విలీనం అయ్యాయి.
‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని సీఎం కేసీఆర్ ఇచ్చిన నినాదంతో మహారాష్ట్ర రైతులు, యువకులు, మహిళలు ఆకర్షితులై గులాబీగూటికి చేరువవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే లు, జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు సహా వందలాదిగా సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తాజాగా సీఎం కేసీఆర్ సమక్షంలో ఎన్సీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనశ్యామ్ షెలార్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు అహ్మద్నగర్కు చెందిన పలువురు ప్రముఖులు బీఆర్ఎస్లో చేరారు.