భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఆంధ్రా పాలనలో అభివృద్ధికి నోచుకోని మన్యం ప్రాంతం.. తెలంగాణ వచ్చాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. ఏజెన్సీ ప్రాంతంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి.. సాగు, తాగు నీరు ఇచ్చారు. పట్టుదలతో పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించారు. వైద్యరంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కొత్త జిల్లాకు వైద్యాన్ని చేరువ చేసేందకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. దానికితోడు నర్సింగ్ కాలేజీని, 100 పడకలతో మాతాశిశు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. కేటీపీఎస్, బీటీపీఎస్ ద్వారా విద్యుత్తు వెలుగులు పంచడంతోపాటు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రూ.56.50 కోట్లతో విశాలమైన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. ఈ కలెక్టరేట్ను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇలా సొంత రాష్ట్రంలో దినదినాభివృద్ధి చెందుతున్న భద్రాద్రి జిల్లాపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
చెంతనే గోదావరి ఉన్నా ఉమ్మడి పాలకులు ఏనాడూ దానిపై ప్రాజెక్టులు కట్టలేదు. అన్నదాతలకు సాగునీరిచ్చే ఆలోచన చేయలేదు. తెలంగాణ వచ్చాక.. సీఎం కేసీఆర్ ఇక్కడి సాగు భూములను సస్యశ్యామలం చేయాలని, రైతులకు సాగునీరివ్వాలని సంకల్పించారు. అందుకోసం సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6.75 లక్షల ఎకరాల బీడు భూములకు సమృద్ధిగా సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.13,058 కోట్లు కేటాయించారు. మరికొన్ని రోజుల్లోనే జిల్లాలో గోదావరి జలాలు పారనున్నాయి. అలాగే సీతారామ ప్రాజెక్టు దిగువ భాగాన రూ.3,200 కోట్లతో సీతమ్మసాగర్ పేరిట బహుళార్థ సాధక ప్రాజెక్టుకూ రూపకల్పన చేశారు.
అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర ఉండి పనిచేయాలన్న లక్ష్యంతో రూ.56.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ భవనాన్ని గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల ప్రజలకు పాలన మరింత చేరువకానుంది. కలెక్టర్తోపాటు ఇద్దరు అదనపు కలెక్టర్లు, డీఆర్వో కూడా అక్కడే నివాసం ఉండేందుకు క్వార్టర్లు కూడా నిర్మించారు.
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్) కూడా తెలంగాణకు వరంగా నిలిచింది. మణుగూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ పవర్ స్టేషన్ ద్వారా 1,080 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. దీని నిర్వాసితుల్లో 340 మందికి అదే కర్మాగారంలో ఉద్యోగాలు ఇచ్చారు. మరో 3,000 మందికి ఉపాధి కల్పించారు.
ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో భద్రాద్రిని వరదలు ముంచెత్తడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూశారు. దీంతో వెంటనే స్పందించి వాటి నివారణకు రూ.1000 కోట్లు కేటాయించారు. అప్పటికే వరదల్లో చిక్కుకున్న బాధితుల్లో ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున తక్షణ సాయాన్ని అందించారు. ముంపు ప్రాంతాల బాధితులకు శాశ్వత పరిష్కారం కోసం పక్కా ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు.
జిల్లాలోని పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీశాఖ ద్వారా 228 ఎకరాల్లో కొత్తగూడెం లో సెంట్రల్ పార్కును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సెలవు దినాల్లో ప్రకృతి ప్రేమికులు తమ కుటుంబాలతో వచ్చి ఈ అర్బన్ పార్కులో సేద దీరుతున్నారు. పాల్వంచలో జింకల పార్కు, బోటు షికారు వంటివి అందుబాటులోకి తెచ్చారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా కొత్తగూడెంలో హరిత హోటల్ను కూడా ప్రభుత్వం నిర్మించింది.
రాష్ర్టానికి విద్యుత్తు వెలుగులు అందిస్తున్న కేటీపీఎస్.. రాష్ట్రం ఏర్పడ్డాక మరింత అభివృద్ధిలో దూసుకుపోతున్నది. కేటీపీఎస్ ఏడో దశలో 800 మెగావాట్ల సామర్థ్యం గల నూతన థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5,500 కోట్లు మంజూరు చేసింది. 2015 జనవరిలో యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించి.. దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలం(కేవలం 33 నెలల వ్యవధి)లో ప్రాజెక్టును పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ దశ నిర్మాణం వల్ల దాదాపుగా 440 మంది కార్మికులు, ఉద్యోగులు, 400 మంది ఆర్టిజాన్లు, 250 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించాయి. విద్యుత్తు రంగంలోని కాంట్రాక్టు కార్మికులనూ సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 వేల మంది ఆర్జిజాన్లకు ఉద్యోగ భద్రత కల్పించగా.. కేటీపీఎస్లో దాదాపు 2100 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు.
కేంద్రం కాదన్నా సీఎం కేసీఆర్ మన్యం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. రూ.500 కోట్లతో పాల్వంచ కేఎస్ఎం వద్ద దీనిని నిర్మించి ప్రారంభించడంతో అక్కడ తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఆ కాలేజీలో 150 మంది మెడికల్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో స్థానిక మన్యం విద్యార్థులు కూడా సీట్లు పొందారు. దీంతోపాటు 100 పడకల మాతాశిశు కేంద్రాన్ని, జిల్లా జనరల్ దవాఖానను అందుబాటులోకి తెచ్చారు. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకూ వైద్యసేవలు చేరువయ్యాయి. మాతాశిశు మరణాల నివారణకు ఎంసీహెచ్ దవాఖానలో టిఫా స్కానింగ్ను కూడా అందుబాటులోకి తెచ్చారు.