హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీతోపాటు వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. తద్వారా లక్షల మంది యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఉద్ఘాటించారు. ఇందుకోసం యువత తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగంలో ఇప్పటికే 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, నూతన జోన్ల ఆమోదం తరువాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో యాభైవేల ఉద్యోగాల భర్తీ కోసం కార్యాచరణ ప్రారంభమైందని పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధన ఫలాలను వర్తమాన, భవిష్యత్ యువతరానికి పూర్తిస్థాయిలో అందించేలా తెలంగాణను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని, అందుకు తగిన విధంగా, పకడ్బందీగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతున్నదని వివరించారు. గత పాలనలో అన్ని రంగాల్లో శిథిలమైన మౌలిక వసతులను, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవింపజేసుకొంటూ వస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
సకల జనులు గుణాత్మకంగా అభివృద్ధి చెందిననాడే నిజమైన అభివృద్ధి అని, దానినే ప్రభుత్వం విశ్వసిస్తున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. అందులో భాగంగానే ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి కార్యాచరణ చేపట్టిందని వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ పట్టణ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా ఏడేండ్లుగా అమలుపరుస్తున్న ప్రభుత్వ కార్యాచరణ కొలిక్కి వచ్చిందని తెలిపారు. సంపదను సృష్టించి దానిని ప్రజలకు పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పునరుద్ఘాటించారు. పునర్నిర్మితమైన తెలంగాణ ఫలాలను యువతీయువకులు అనుభవించే పరిస్థితులు నేడు నెలకొన్నాయని సంతోషం వ్యక్తంచేశారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తురంగాలను గాడిలో పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధిపరచి, రైతులు సహా సబ్బండ వర్ణాల సంక్షేమానికి అనేక పథకాలను అమలుపరుస్తూ వస్తున్నామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సమీకృత అభివృద్ధి కార్యాచరణ.. సత్ఫలితాలనిస్తున్నదని చెప్పారు. పలు పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతంచేశామని, తద్వారా గ్రామీణ యువతకు ఉపాధికల్పన అవకాశాలు పెరిగాయని తెలిపారు. పట్టణాల్లోనూ ఉపాధి రంగాలను మెరుగుపరిచే కార్యక్రమాలను అమలుచేస్తూ వాటి ఫలాలను యువతకు అందించే స్థాయికి చేరుకొన్నామని హర్షం వ్యక్తంచేశారు.
ఐటీ రంగంలో లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చిందని, నూతన జోన్ల ఆమోదం తరువాత జోన్ల విషయంలో స్పష్టత రావడంతో మరో యాభైవేల ఉద్యోగాల కోసం కార్యాచరణ ప్రారంభమైందని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్లో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందని చెప్పారు. దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు నిదర్శనమన్నారు. వ్యవసాయరంగం నేటి యువతను ఆకర్షిస్తుండటం వెనుక తెలంగాణ ప్రభుత్వం శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు.
పారిశ్రామిక, వాణిజ్యం, ఐటీ రంగాలు సహా వ్యవసాయం, దాని అనుబంధరంగాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని, ఈ నేపథ్యంలో లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జరుగుతున్నదని వివరించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మారిన కాలమాన పరిస్థితుల్లో యువత తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ యువత ఎంతో సమర్థమైనదని, వారికి నైపుణ్యాలు తోడయితే తిరుగులేని యువశక్తిగా అవతరిస్తుందని సీఎం వివరించారు. ఈ నేపథ్యంలోనే యువతలో నైపుణ్యాల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తున్నదని, ఐటీ సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించేదిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్ఞాన అకాడమీ (టాస్క్) ని దేశంలోనే తొలిసారిగా ఏర్పాటుచేశామని తెలిపారు. తద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న యువతీయువకులకు సాంకేతిక, సాంకేతికేతర పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణను అందిస్తున్నామని, యువతను ప్రోత్సహించేలా ఐటీ పాలసీని రూపొందించామని గుర్తుచేశారు. ప్రత్యేకంగా టీ సాట్ ద్వారా నిరుద్యోగ యువతకు వివిధ స్థాయిల్లో అవగాహనతోపాటు శిక్షణ కార్యక్రమాలను అందిస్తున్నామని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.