హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురసరించుకుని ఆయన చేసిన త్యాగాలను సీఎం కేసీఆర్ సోమవారం స్మరించుకున్నారు. దొడ్డి కొమురయ్య అమరత్వం అందించిన చైతన్యస్ఫూర్తి మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొనసాగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంటరీ పంథాలో సాగిన శాంతియుత పోరాటంలో, సబ్బండ వర్గాలు తమ వంతుగా ఉద్యమించాయని, తమ ఆకాంక్షలను చాటడంలో దొడ్డి కొమురయ్య స్ఫూర్తి ఇమిడి ఉన్నదని పేర్కొన్నారు.
అమరవీరుల త్యాగాలను తెలంగాణ ప్రభుత్వం నిత్యం స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. బీసీ కుల వృత్తులను పరిరక్షిస్తూ వారిని ప్రగతిపథంలో నడిపేందుకు, అన్ని విధాలా సాయం అందిస్తున్నదని వివరించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని పేర్కొన్నారు. కులవృత్తిదారులైన గొల్ల కురుమల అభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం, వారి ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో అధికభాగం లబ్ధిదారులు బీసీ బిడ్డలే కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలు, ఆసరా పింఛన్లు, రైతుబంధు సహా అనేక పథకాలు బీసీల ఆత్మగౌరవాన్ని, ఆర్థిక గౌరవాన్ని పెంపొందించాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణలో నేడు బీసీల స్థితిగతులు గుణాత్మకంగా పురోగమించాయని, వారి ప్రగతి సామాజిక ప్రగతికి బాటలు వేసిందని చెప్పారు. నేడు దేశ ఆర్థిక వ్యవస్థకే వెన్నుదన్ను అందించే రీతిలో తెలంగాణ సబ్బండ కులాలు ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. నాటి సాయుధపోరాట కాలం నుంచి నేటి మలి దశ తెలంగాణ ఉద్యమకాలం దాకా దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. అమరుల సంస్మరణార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అమరజ్యోతి త్వరలో ప్రారంభం కానున్నదని సీఎం పేర్కొన్నారు. దొడ్డి కొమురయ్య త్యాగానికి గుర్తుగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఘన నివాళులర్పిస్తున్నదని తెలిపారు.