CM KCR | అచ్చంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఆగమై కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ రెండు పథకాలు ఆగిపోతాయని కేసీఆర్ పేర్కొన్నారు. కాబట్టి ఆలోచించి ఓటేయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతుబంధు అనేది ఈ ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. అప్పులు చెల్లించకపోతే బ్యాంకు వాళ్లు వచ్చి తలుపులు తీసుకోవడం, మెడమీద కత్తి పెట్టడం తప్పా.. రైతుల గురించి ఆలోచించలేదు. ఈ సమాజం మళ్లీ పురోగతి రావాలి. రైతుల ముఖాలు తెల్లపడాలి. గ్రామాల్లో ధాన్యం రాశులు రావాలని రైతుబంధు తెచ్చిందే కేసీఆర్. ప్రస్తుతం రూ. 10 వేలు ఇస్తున్నాం.. దాన్ని రూ. 16 వేలకు తీసుకెళ్తాం. ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్తున్నాం. ఓట్ల కోసం హామీలు ఇవ్వడం లేదు. ఇవాళ తెలంగాణ అన్నపూర్ణ అయింది. ఇలాంటి రాష్ట్రంలో నా ప్రజలు ఎందుకు దొడ్డు బియ్యం తినాలని చెప్పి.. సన్నబియ్యం ఇస్తామని చెప్పాం. ఇచ్చి తీరుతాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
దళిత సమాజం బాగా ఆలోచించాలి.. దళితబంధు పుట్టించిందే నేను అని కేసీఆర్ చెప్పారు. 50 ఏండ్లు కాంగ్రెస్ రాజ్యంలో ఉన్నది. రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, దేశంలో ప్రధాన మంత్రులు వారే. దళితులను ఓటు బ్యాంకులాగా వాడుకున్నారు. ఒక్కనాడు కూడా మనకు మంచి పని చేయలేదు. దళితబంధు నెహ్రూ కాలంలో ప్రారంభించి ఉంటే.. ఇవాళ దళితులు బ్రహ్మాండంగా రాజుల్లాగా ఉండేవారు. ఈ గతి ఎందుకు ఉంటుండే అని కేసీఆర్ ప్రశ్నించారు.
నేను ఎంతగానం కొట్లాడాలి.. ఇక మీరు కొట్లాడాల్సిన సమయం వచ్చిందని కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇరిగేషన్ సదుపాయం పెరగాలి. ఉమా మహేశ్వర లిప్ట్ మంజూరు చేసుకున్నాం. మూడు రిజర్వాయర్లు కట్టుకుంటున్నాం. అప్పర్ ప్లాట్కు కూడా నీళ్లు ఇస్తాం. 2 లక్షల ఎకరాలకు తప్పకుండా నీళ్లు తెచ్చి ఇస్తాం. పనులు మొదలు కాబోతున్నాయి. పాలమూరు ఎత్తిపోతల కడితే అడ్డం పడ్డదే కాంగ్రెస్ నాయకులు. 192 కేసులు వేశారు. కేసులు క్లియర్ అయ్యాయి. పాలమూరు ఎత్తిపోతల పథకం రాబోయే కొద్ది రోజుల్లో అందుబాటులోకి రాబోతుంది అని కేసీఆర్ తెలిపారు.
మనకు కులం లేదు, మతం లేదు అని సీఎం స్పష్టం చేశారు. ముస్లిం సోదరులకు రెసిడెన్షియల్ పాఠశాలలు అందుబాటులోకి తెచ్చాం. బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. అందర్నీ ఆదుకుంటున్నాం. వెయ్యికి పైగా గురుకులాలు స్థాపించాం. వాటిని అప్గ్రేడ్ చేస్తాం. దయచేసి ఎన్నికల్లో ఆగం కావొద్దు. ఎవరు గెలిస్తే తెలంగాణ ముందుకు పోతదో ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు.
ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఈ కాంగ్రెస్ పార్టీనే అని కేసీఆర్ గుర్తు చేశారు. ఎంతో మందిని కాంగ్రెస్ కాల్చి చంపింది. 1969లో 400 మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిని జైల్లో వేశారు. 2004లో పొత్తు పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2004 నుంచి 2014 దాకా తెలంగాణ ఇవ్వలేదు. మనల్ని ఏడిపించారు. తాను ఆమరణ దీక్ష పెడితే.. కేసీఆర్ శవయాత్రానా.. తెలంగాణ జైత్రయాత్రానా అని నినాదిమిస్తే తెలంగాణ వచ్చింది. 32 పార్టీల మద్దతు కూడగొట్టి.. తొక్కిపారేస్తాం అని హెచ్చరిస్తే ఇవ్వక తప్పదని తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బాగోగులు అవసరం లేదు.. తెలంగాణ మీద పెత్తనం కావాలి వారికి అని కేసీఆర్ మండిపడ్డారు.