CM KCR | వికారాబాద్ : దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఒకే విడుతలో దళితబంధు అమలు చేశామని, ఇప్పుడు అక్కడ దళిత వాడలు.. దొరల వాడల మాదిరిగా తయారు అయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మెతుకు ఆనంద్కు మద్దతుగా ప్రసంగించారు.
తరతరాలుగా దోపిడీకి గురయ్యారు దళిత సమాజం. అణిచివేతకు వివక్షకు గురైన సమాజం. కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసి ఉంటే ఇంకా పేదరికం ఎందుకు ఉండేది దళితుల్లో. ఇంత అధ్వాన్నమైన పరిస్థితి ఎందుకు ఉండేది. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. అమ్మను చూడు.. మాకు ఓటు గుద్దు అని ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప సంక్షేమానికి పాటు పడలేదు. భారతదేశంలో ఎక్కడ.. ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ, ఏ ప్రధాని ఆలోచించని పద్ధతుల్లో మేం ఆలోచించి దళితబంధు పెట్టినం. మంచి ఫలితాలు వస్తున్నాయి అని కేసీఆర్ తెలిపారు.
వికారాబాద్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. హుజురాబాద్లో మొత్తం ఒకేసారి పెట్టం. అక్కడ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కడుపు నిండినట్టు ఉంది. అది దళితవాడలాగా లేదు.. దొరలవాడలాగా తయారైంది. ఎవరికి వారు బిజినెస్లు పెట్టి బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఆనంద్ను గెలిపిస్తే వికారాబాద్ నియోజకవర్గానికి ఒకే విడుతలో దళిత బంధు పెడుతా. ఈ దెబ్బతో దళిత కుటుంబాలు మొత్తం ధనిక కుటుంబాలు అయితయ్. ఎవడో ఎల్లయ్య గెలిస్తే వచ్చేది ఏం లేదు. ఆనంద్ గెలిస్తే ప్రతి దళిత కుటుంబం బంగారు కుటుంబం అయితది కాబట్టి నా మేసేజ్ను ప్రతి గడపకు తీసుకెళ్లి భారీ మెజార్టీతో గెలిపించండి. నేనే స్వయంగా వచ్చి దళితబంధు ప్రారంభిస్తా. అన్ని కుటుంబాలకు దళితబంధు ఇచ్చి వికారాబాద్ దరిద్రాన్ని తీసి అవతల పడేద్దాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు.