ఆసిఫాబాద్: ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలు మొదలైతయని, రైతులకు సమస్యలు ఎదురైతయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో సీఎం మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు ఇక్కడి ప్రజానీకం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నదని, సరైన సాగునీటి సదుపాయాలు లేక, పంట దిగుబడి సరిగా లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరని ఆయన గుర్తుచేశారు. అందుకే మలిదశలో దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నమని చెప్పారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, గ్రామాలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నయని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రామాలు పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదని, ఇప్పుడు గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని సీఎం కేసీఆర్ చెప్పారు. పసిపిల్ల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నయన్నారు. ఇంత అభివృద్ధి జరుగుతున్నా కొంత మంది అవాకులు, చెవాకులు పేలుతున్నరని, కాంగ్రెస్ నేతలు ధరణిని ఎత్తివేస్తమని మాట్లాడుతున్నరని చెప్పారు. ధరణిని ఎత్తివేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అందరికీ తెలుసని, మళ్లీ పైరవీకారుల మందలు రాజ్యమేలుతయని, భూరికార్డుల్లో అడ్డగోలు మార్పులుచేర్పులు చోటుచేసుకుంటయని, అవినీతి అధికమై అమాయక రైతులు దోపిడీకి గురైతరని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండకూడదనే తాము ధరణిని తీసుకొచ్చామని, ఇప్పుడు ధరణిని తీసేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తదని సీఎం అన్నారు. అందుకే తాను ఎక్కడికి పోయినా ప్రజలను ధరిణి ఉండాల్నా.. వద్దా..? అని అడుగుతున్నానని, కానీ ఎక్కడ అడిగినా ప్రజలు మాత్రం ధరణి ఉండాలనే కోరుకుంటున్నరని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆసిఫాబాద్ ప్రజలను కూడా తాను అదే ప్రశ్న అడుగుతున్నానని, ధరణి ఉండాల్నా.. తీసేయాల్నా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. దాంతో ప్రజలంతా ముక్తకంఠంతో ధరణి ఉండాలని చెప్పారు. ధరణి కావాలనుకునే వాళ్లంతా చేతులెత్తాలని సీఎం కోరగా.. అందరూ చేతులు పైకెత్తారు. దాంతో ప్రజలేమో ఇట్ల ధరణి కావాలని కోరుకుంటుంటే, కాంగ్రెసోళ్లు మాత్రం ధరిణి తీసేయాలంటున్నరు అని కేసీఆర్ విమర్శించారు.
ధరణిని తీసేస్తే రైతుబంధుకు సమస్య అయితదని, ప్రజలు భూముల పట్టాల కోసం కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి వస్తదని సీఎం అన్నారు. నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగడమేగాక బ్రోకర్లకు లంచాలు ముట్టజెప్పాల్సి వస్తదని, అమాయక రైతులు దోపిడీకి గురైతరని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ఇలాంటివన్నీ చూసే తాము రైతుల బాగు కోసం ధరణిని తీసుకొచ్చామని, వేరే ఉద్దేశమేమీ లేదని సీఎం అన్నారు.