యాదాద్రి భువనగిరి : కార్పొరేట్కు దీటుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి మండలం తుక్కుపురం గ్రామంలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలను తరగతి గదులను పరిశీలించిన మంత్రి మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్షించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..విద్యతో మనిషి జీవితాల్లో వెలుగులు నింపొచ్చని ఆయన తెలిపారు. విద్యను పెట్టుబడిగా పెడితే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని నిరూపించిన మహానేత బాబసాహెబ్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు.
దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీలకు ఉన్నత విద్యను అందించేందుకు గాను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 1000 పైగా గురుకులాలు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇన్ని గురుకులాలు నెలకొల్పిన రాష్ట్రంగా యావత్ దేశంలోనే తెలంగాణా రాష్ట్రం రికార్డ్ సృష్టించిందన్నారు. అంతే గాకుండా ఆర్థిక భారం ఇతరత్రా కారణాలతో ఇంటర్ పైన విద్యకు స్వస్తి చెప్పే మహిళల డ్రాపౌట్స్ ను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 33 మహిళా డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.