హైదరాబాద్, మార్చి 9 : సీఎం కేసీఆర్ ఏది సంకల్పించినా.. ఏది చేసినా.. పక్కాగా పకడ్బందీగా చేస్తారు. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకొంటారు. కొంత ఆలస్యమైనా శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపేదిశగా అడుగులువేస్తారు. దీనికి తార్కాణం ప్రస్తుత ఉద్యోగాల భర్తీకి ముందు జరిగిన కసరత్తు. ఆలస్యమైనా పర్వాలేదు.. అన్యాయం జరగరాదన్న ఆలోచనతో సుదీర్ఘ కసరత్తు తర్వాత.. ప్రణాళికబద్ధంగా ప్రక్రియను చేపట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలు’ ఎజెండాగా ఉద్యమించి సాధించుకొన్న తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం కూడ పరాయి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్న దృఢ సంకల్పంతో కార్యాచరణ చేపట్టారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన వాటా దక్కించుకోని గోండు, కోలామ్, కోయ, తోటి, పర్దాన్ వంటి ఆదివాసీ గిరిజనులు సమానవాటాను దక్కించుకోబోతున్నారు.
పాత జోనల్ విధానంలో నష్టపోయిన తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో పాత జోనల్ విధానం ప్రకారం జిల్లా పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్ క్యాటగిరీ, జోనల్ పోస్టులో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్ క్యాటగిరీ, మల్టీ జోనల్ పోస్టులో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీ కింద నియామకాలు చేపట్టేవారు. అలాగే స్టేట్ క్యాడర్ అంతా ఓపెన్ క్యాటగిరిలోనే నియమకాలు జరిపేవారు. ఈ విధానంలో ఉన్న ఓపెన్ క్యాటగిరీని సీమాంధ్ర ప్రభుత్వాలు నాన్ లోకల్ క్యాటగిరీగా మార్చి.. తమవారితో నింపేశారు. దీనికి తోడు ఆరో జోన్లో ఉన్న హైదరాబాద్ను ఫ్రీ జోన్ పేరిట మొత్తం సీమాంధ్రులతో నింపేయడంతో తెలంగాణ యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజన తరువాత ఇదే విధానాన్ని అనుసరిస్తే.. తిరిగి అదే అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ పసిగట్టారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, మనోభావాల మేరకు పూర్తిగా స్థానికులతోనే నియమకాలు చేపట్టే అవకాశం ఉండే విధంగా నూతన జోనల్ విధానం తీసుకురావాలని నిర్ణయించారు. వివిధ దశల్లో చర్యలు తీసుకొని 95 శాతం స్థానికతను సాధించారు.
మొదటి దశ..
క్యాడర్ స్ట్రెంత్ను ఖరారు చేసేందుకు 2021 ఆగస్టు 6న ప్రభుత్వం 86 జీవోలను జారీచేసింది. ఈ జీవోల ప్రకారం ప్రభుత్వ శాఖల్లో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లవారీగా పోస్టులను అన్వయించుకున్నాయి. ఆయా విభాగాలన్నీ తమ పరిధిలోని పోస్టులను కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లవారీగా వర్గీకరించాయి. దీంతో అన్ని విభాగాల్లో ఏ పోస్టు ఏ క్యాడర్లో ఉన్నదో.. స్పష్టతవచ్చింది.
రెండో దశ..
జిల్లాలవారీగా క్యాడర్ స్ట్రెంత్ను ఖరారుచేశారు. జిల్లాలో విభాగాలవారీగా మొత్తం పోస్టులెన్నో తేల్చారు. ప్రస్తుతానికి చిన్న జిల్లాల్లో పోస్టులు లేకపోగా, ఆయా జిల్లాలకు పోస్టులు కేటాయించారు. దీంతో జిల్లాలు, విభాగాలవారీగా పోస్టుల స్వరూపం మారింది.
మూడో దశ..
ఈ దశలో పోస్టులను బట్టి కొత్త జిల్లాలు, జోన్లను బట్టి ఉద్యోగుల సర్దుబాటును చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం జీవో -317ను జారీచేసింది. ఆప్షన్లు ఇచ్చి ఉద్యోగుల కేటాయింపును పూర్తిచేశారు. ఈ ప్రక్రియలో గ్రామీణ, అటవీ ప్రాంతాలకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగులను బదిలీచేశారు. స్పౌజ్, మ్యూచువల్ కోటాలోను బదిలీలకు అవకాశం కల్పించారు.
నాలుగో దశ..
జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లవారీగా ఖాళీలపై స్పష్టత వచ్చింది. జిల్లాకు కేటాయించిన పోస్టులెన్ని, ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు, భర్తీచేయాల్సిన ఖాళీలెన్ని అనే అంశంపై స్పష్టత వచ్చింది. తుది అంకమైన నాలుగో దశ ప్రక్రియకు సర్కారు బుధవారంమే శ్రీకారం చుట్టింది.
ఢిల్లీలో రామకృష్ణారావు, సంతోష్రెడ్డి కష్టపడ్డారు
అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంస
‘తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే.. ముల్కీ రూల్స్కు మించిన స్పిరిట్ అమలు కావాలి.. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపి పంపినం.. తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, లా సెక్రటరీ సంతోష్రెడ్డి ఢిల్లీలో ఎంతో శ్రమించారు’ అని సీఎం కే చంద్రశేఖర్రావు ప్రశంసించారు. బుధవారం అసెంబ్లీలో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనకు ముందు సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులపై మాట్లాడుతూ.. ఆ సమయంలో కష్టపడ్డ ఉన్నతాధికారుల పేర్లను ఊటంకించారు. ‘వాళ్లు ఎన్నోసార్లు ఢిల్లీకి పోయినారు. విమానం ఖర్చులే చాలా అయినయ్. చివరికి నేనే ఢిల్లీకి పోయిన. రాష్ట్రపతి, ప్రధానిని కలిసిన. పాలిటిక్స్ ఫర్ టీఆర్ఎస్ ఈజ్ ఏ టాస్క్ నాట్ ఏ గేమ్.. మా దృక్కోణం అట్లుంటది. మా దృష్టికోణం అట్లుంటది. రెండురోజులు ఆలస్యమైనా మేం అట్ల పనిచేస్తం. చివరికి 95 శాతం లోకల్ రిజర్వేషన్లతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించుకొన్నాం’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.