హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కొండగట్టు అంజన్న క్షేత్రానికి చేరుకోనున్నారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి బేగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో జగిత్యాల జిల్లాలోని కొండగట్టు బయలుదేరారు. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకొంటారు. అక్కడి నుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం కొండగట్టుపై ఉన్న కోనేరు, కొత్త పుష్కరిణి, బేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొండలరాయుడి గుట్ట తదితర స్థలాలను పరిశీలించి జేఎన్టీయూకు బయలుదేరుతారు.
జేఎన్టీయూ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంలో చేయాల్సిన మార్పులు-చేర్పులపై సమాలోచనలు జరుపుతారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టే అభివృద్ధి పనులపై ఓ నిర్ణయానికి రానున్నారు. ఇప్పటికే కొండగట్టు అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.