సిద్దిపేట అర్బన్, జూన్ 12: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిలబెడుతున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. అదే కోవలో ఆర్టీసీని కాపాడుతున్నారని చెప్పారు. సిద్దిపేటలో నూతనంగా నిర్మించిన మాడల్ బస్టాండ్ను ఆదివారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. మేము రైల్వేలు, విమానసంస్థలు, ఎల్ఐసీని అమ్మినం.. మీరు కూడా ఆర్టీసీ, బస్టాండ్లను అమ్మాలని కేంద్రం సలహా ఇచ్చిందని గుర్తుచేశారు.
ప్రభుత్వరంగ సంస్థలు అమ్మితే నజరా నా ఇస్తామని చెప్పిందన్నారు. కానీ, సీఎం కేసీఆర్ ఆర్టీసీని కాపాడాలనే ఉద్దేశంతో ఏటా రూ.1500 నుంచి రూ.3 వేల కోట్ల వరకు బడ్జెట్లో నిధులు కేటాయించారని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డా సిద్దిపేట బస్టాండ్ అని, 1,531 రోజులు నిరాహార దీక్షలు చేసి ఢిల్లీ దాకా తెలంగాణ వాణిని వినిపించిన ఘనత దీనికి సొంతమన్నారు. ఉద్యమ సమయంలో జస్టిస్ శ్రీకృష్ణకమిటీ సందర్శించిన గొప్ప బస్టాండ్ అని.. అంతటి చరిత్ర ఈ బస్టాండ్కు ఉన్నదని చెప్పారు. సిద్దిపేటకు ఏడాదిలోపే రైలు రానున్నదని వెల్లడించారు. త్వరలోనే ఐటీ పార్క్ నిర్మాణం పూర్తయి.. సాఫ్ట్వేర్ కంపెనీలను సిద్దిపేటకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అయిన తరువాత సిద్దిపేట కల మారిపోయిందని, సీఎంగా కేసీఆర్ ఉండటం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయని ఉద్ఘాటించారు.
డబుల్ ఇంజిన్ ట్రబుల్ ఇంజిన్
డబుల్ ఇంజిన్ అని చెప్పే ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం రూ.70 వేలు అయితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,000 అని, నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందని హరీశ్రావు ఎద్దేవాచేశారు. బీజేపీ ప్రభుత్వం ఉండి.. స్వయంగా ప్రధాని ప్రాతినిధ్యం వహించే యూపీ తలసరి ఆదాయంలో ఎక్కడ ఉందో చూసుకోవాలన్నారు. తెలంగాణ నంబర్ వన్గా ఉంటే యూపీ చివరి స్థానంలో ఉన్నదని స్పష్టంచేశారు. 70 ఏండ్లలో చేయని పనులు ఎనిమిదేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిందన్నారు. తాను తిరుపతి దర్శనానికి వెళ్లినప్పుడు ఇతర రాష్ర్టాల వారిని వారి రాష్ట్ర పరిస్థితి అడిగి తెలుసుకుంటే.. మనకు ఏమాత్రం దరిదాపుల్లో లేవన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల, ఏఎంసీ చైర్మన్ విజిత, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తంనాయక్ తదితరులు పాల్గొన్నారు.