CM KCR | దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో, బస్తీలు.. ఎక్కడికక్కడ చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభించి, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ సమాజమైతే, ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా, నిద్రాణమై, నిర్లక్ష్యంగా ఉంటరో వారు దెబ్బతినే అవకాశం ఉంటుంది. 60 సంవత్సరాల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండే. ఆ సమయంలో మనకు ఇష్టం లేకపోయినా.. పోరాడలేదు కాబట్టి తెలంగాణను తీసుకుపోయి.. ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఎన్ని బాధలు పడ్డాం.
ఎంత మంది పిల్లలు చనిపోయారు? ఎంత మంది జైళ్లపాలయ్యారు? 58 సంవత్సరాలు మడమతిప్పని పోరాటం చేస్తే మళ్లా మన రాష్ట్రం మనకు వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే.. కరెంటు మనకు వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? ఇన్ని పింఛన్లు వచ్చేవా? ఈ విధంగా మంచినీళ్లు వచ్చేవా? చాలాచాలా అవస్థల్లో ఉండేవాళ్లం. దేశంలో జరిగే రాజకీయాలను, దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు గ్రామాల్లో, సిటీ అయితే గ్రామాల్లో చర్చలు జరిగాలి. టీవీల్లో వార్తలు చూసి వదిలేయవద్దు. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తుంది. చైతన్యం కోల్పోయి ఉంటే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది’ అన్నారు.
‘ఆగస్టు 15 వేడుకలకు సంబంధించి హైటెక్స్ సభలో చెప్పాను. ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమైతది. కూలగొట్టాలంటే.. పది రోజులుపడుతుంది. కానీ, ఒక కూర్పు జరగాలంటే.. ఒక ఇల్లు నిలబెట్టాలంటే.. ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాస పడాల్సి వస్తుంది. అలాంటి భారతదేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద చాలా నీచమైన రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఏరకంగా మంచిది కాదు. ఏ పద్ధతుల్లో మంచిది కాదు. ఎంతో మంది పెద్దలు స్వతంత్ర పోరాట యోధులు త్యాగాలు చేసి, దశాబ్దాల పాటు జైళ్లలో ఉండి.. ఈ దేశాన్ని తెచ్చి మనకు ఇచ్చారు.
ఈ స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్య్ర పూర్తి ఫలాన్ని పూర్తిస్థాయిలో దేశం పొందాలంటే.. దేశంలో కులం, మతం, వర్గమని బేధం లేకుండా భారతీయత, భారతీయ ఐక్యత మనలో రావాలి. ఒకసారి దెబ్బతిన్నమంటే.. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లీ ఏకం కావడం అంత సులభం కాదు. కాబట్టి వాటిన్నంటిని పక్కనబెట్టి.. ఏ విధంగా అయితే చైనా.. పురోగమించిందో, సింగపూర్ పురోగమించిందో.. కొరియాలాంటి దేశాలు పురోగమించాయో.. అదే బాటలో భారతీయులందరు కులమత రహితంగా బ్రహ్మండంగా ముందుకు సాగాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
‘దేశంలో అపారమైన నదులు ఉన్నయ్. అపారమైన సంపద ఉన్నది. కానీ దేశానికి చెందడం లేదు. మన దురదృష్టం. జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి. తెలంగాణలో లేని కరెంటు ఎక్కడి నుంచి వచ్చింది? ఏడేళ్ల కిందట మనం ఎట్ల ఉన్నం?.. మన పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో రాదు.. ఆఖరికి దేశ రాజధాని ఢిల్లీలో రాదు. తెలంగాణ వస్తది ఎట్లా? ఢిల్లీలో రాదెట్లా? తెలంగాణలో పుష్కలంగా మంచినీళ్లు ఉంటయ్ ఎట్లా? ఢిల్లీలో ఉండయ్ ఎట్లా? ఢిల్లీ సిటీలో రోజూ కొనుక్కుంటరు. ట్యాంకర్లు వేల రూపాయలు పెట్టి. ప్రతి ఇంట్లో గొయ్యి తవ్వి.. ఆ గోతిలో నింపుకుంటరు. నా మిత్రులే నాయకు ఢిల్లీ వెళ్లిన సమయంలో చెప్పారు.
తెలంగాణలో జరిగేది బయట ఎందుకు జరుగుతలేదు? ఎందుకు జరుగకూడదు? ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నరు. మనం సమకూర్చుకున్నదాన్ని.. చెమటోడ్చి, కష్టపడి.. ఐకమత్యంతో.. అందరం ఒక మాటమీద ఉండి.. ఒకమాట మీరు విచారం చేయాలే. ఇవాళ గ్రామాల్లో ఏవిధంగా పచ్చని చెట్లున్నయ్.. బస్తీల్లో ఏవిధంగా ఉన్నయ్.. ఏవిధంగా కరెంటు ఉంటున్నది.. ఏ విధంగా సంక్షేమం జరుగుతున్నది ? నెలానెలా ఠంచన్గా పేదవాళ్లకు పింఛన్లు ఏవిధంగా అందుతున్నయ్.. దీన్ని పోడగొట్టుకుందామా? ఈ వసతిని మళ్లీ చెడగొట్టుకుందామా? ఏదో మోసపోతే చాలా గోసపడే ప్రమాదం ఉంటది’ అని పేర్కొన్నారు.
‘విచ్ఛిన్న శక్తులు, ప్రతీప శక్తులు, దుర్మార్గులు, నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. కానీ ప్రజలు అప్రమత్తంగా, తెలివిగా ఉండాలి. ప్రతిగ్రామం, ప్రతిబస్తి, ప్రతీచోట చర్చ జరగాలి. నిజమేందో? అబద్ధమేందో తెలుసుకొని జాగ్రత్తగా ఉంటేనే.. మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుకోగలుగుతాం. మేడ్చల్ చైతన్యం ఉన్న జిల్లా. మీరంతా ఐకమత్యంతో ఉండి.. రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతూ.. ఇదే పద్ధతిలో దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేవిధంగా ఐకమత్యంతో, చైతన్యంతో ముందుకు సాగాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు.. ఆ నిమిషానికి తమాషా అనిపిస్తది. కానీ, ఫలితాలు చాలా దుర్మార్గంగా ఉంటాయ్. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా.. ఏ మాత్రం మోసపోయినా చాలా గోసపడుతాం.
ఇప్పటికే 58 సంవత్సరాలు గోసపడ్డాం.. దగాపడ్డాం. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నం. ఇప్పుడిప్పుడే ఓ దరికొస్తున్నం. కాబట్టి శాంతిని, ఈ సుఖాన్ని, ఈ రోజు కలుగుతున్న ఆస్తులను.. ఇవన్నీ ప్రజల ఆస్తులు. వీటిని కాపాడాలి, ఇంకా పెంపొందించాలి. భవిష్యత్ తరాలకు అందించాలి. భారతదేశంలోనే ఒక సముజ్వల రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పురోగమించాలి. చైతన్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలి, రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని అందరికీ నేను కోరుతున్నాం. అదేపద్ధతిలో ముందుకుపోదామని.. భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం. మేడ్చల్ జిల్లాలో మంజూరు చేసిన రూ.70కోట్లు శాసనసభ్యులు పేదల కోసం, ప్రజల కోసం వినియోగించుకోవాలి’ సీఎం కేసీఆర్ సూచించారు.