చెన్నూరు: తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా ప్రాంతంతో కలిపి నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకంతో సుభిక్షంగా ఉన్న తెలంగాణ సర్వ నాశనం అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం చెన్నూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని ఆయన ఎండగట్టారు.
సీఎం ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘ఉన్న తెలంగాణను ఊడగొట్టి ముంచిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలు వద్దని మొత్తుకుంటుంటే, హైదరాబాద్ సిటీ కాలేజీ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమాలు జరుగుతుంటే ఏడుగురు విద్యార్థులను పట్ట పగలు కాల్చి చంపిండ్రు. ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపిండ్రు. ఆ తర్వాత ఎన్నేండ్లు ఏడిసినం..? ఎన్ని బాధలుపడ్డం..? వాళ్ల పెత్తనం కింద ఎంత నలిగిపోయినం..? ఎంత నాశనమైంది తెలంగాణ..?’ అని ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ చేసిన పనికి నాడు సగం తెలంగాణ బతుకపోవుడే. మహబూబ్నగర్ సగం జిల్లా, మెదక్ సగం జిల్లా, నల్లగొండ సగం జిల్లా ఇలా చాలా జిల్లాలు ఇక్కడ బతుకుదెరువు లేక ఇతర ప్రాంతాలకు బతుకవొయినయ్. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందాక తెలంగాణ పరిస్థితి బాగలేదు. మంచి నీళ్లకు దిక్కులేదు. కరెంటు సక్కగ లేదు. సాగు నీళ్లు లేవు. పంటలు లేవు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు, అప్పుల బాధకు రైతుల ఆత్మహత్యలు ఇలా భయంకరమైన పరిస్థితి ఉండె. దీనంతటికి మూల కారణం ఎవరు..? 50 ఏళ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కాదా..? మీ అందరికీ ఈ చరిత్ర తెలుసు. కానీ ఒకసారి మననం చేస్తున్నా’ అన్నారు.