ఖానాపూర్: హైదరాబాద్లో బంజారాలు, ఆదివాసీల కోసం బ్రహ్మాండమైన భవనాలు కట్టించినమని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖానాపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. గిరిజనుల సంక్షేమం కోసం తాము ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడూ గిరిజనుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ వచ్చినకం తండాలను, గోండు గూడేలను పంచాయతీలుగా మార్చినమని, ఇప్పుడు వాళ్లను వాళ్లే పాలించుకుంటున్నరని చెప్పారు.
‘మేం ఏ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినం. చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, గంగ పుత్రులకు, యాదవ సోదరులకు ఈ విధంగా అన్ని వర్గాలకు సంక్షేమం ఫలాలు అందేలా చర్యలు చేపట్టినం. ఇవన్నీ మీరు చూస్తనే ఉన్నరు. ఇక గిరిజన బిడ్డల కోసమూ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినం. అంతకుముందు ఎవరు కూడా గిరిజన బిడ్డల సమస్యలు తీర్చలే. ‘మా తండాల్లో మా రాజ్యం’ అని, గోండు గూడేళ్లో ‘మావ నాటే.. మావ రాజ్’ అంటూ 50 ఏండ్లు కొట్లాడినా ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఏ ప్రభుత్వం పట్టించుకోలే. కానీ, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక రాష్ట్రంలో 3,600 పైచిలుకు తండాలను, గోండు గూడేలను పంచాయతీలు చేసినం. ఇయ్యాలా గిరిజన బిడ్డలే తమ తండాలను, గోండు గూడేలను పాలించుకుంటున్నరు’ అని సీఎం చెప్పారు.
‘గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేసినం. ఖానాపూర్ నియోజకవర్గంలో సుమారు 7,500 మందికి 22,470 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చినం. అంతటితో చేతులు దులుపుకోలే. అంతకుముందు వాటి మీద ఉన్న కేసులను కూడా రద్దు చేసినం. అదేవిధంగా రైతుబంధు ఇస్తున్నం. రైతు బీమా పెట్టినం. వాళ్ల బావులకు, బోర్లకు త్రీ ఫేజ్ కరెంటు ఇస్తున్నం. ఈ ప్రక్రియ చాలా వరకు పూర్తయింది, ఇంక కొంచెం పూర్తి కావాల్సి ఉన్నది. హైదరాబాద్లో బంజారాహిల్స్ ఉంటది. పేరుకే అది బంజారాహిల్స్ గానీ అక్కడ బంజారాలు లేరు. వాళ్లను తరిమేసిండ్రు. అదే బంజారాహిల్స్లో మేం పట్టుబట్టి సేవాలాల్ మహరాజ్ పేరు మీద కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి బంజారాభవన్ కట్టినం. ఆ పక్కనే ఆదివాసీ బిడ్డల కోసం ఆదివాసీ భవన్ కట్టినం. ఎయిర్ కండిషన్డ్ భవనాలు నిర్మించినం. ఇలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నం’ అన్నారు.