ఇబ్రహీంపట్నం: తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న నాడు చాలా గందరగోళమైన పరిస్థితులు ఉండేవని, ఇయ్యాల అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి బ్రహ్మాండమైన మౌలిక సదుపాయాలను కల్పించుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడక ముందు 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది..? తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందనేది ఆలోచింది ఓటేయాలని ఆయన ఓటర్లకు సూచించారు.
‘మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర తెలుసు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు. కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో 50 ఏండ్లకు పైగా పాలన చేసింది. ఆ కాలంలో ఏపాటి అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ 24 ఏండ్ల కింద పుట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం. బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన్నాడు ఇక్కడ ఏదీ సరిగా లేదు. చాలా గందరగోళ పరిస్థితి ఉండె. కరెంటు లేదు. సాగునీళ్లు లేవు. మంచి నీళ్లు లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొత్త రాష్ట్రం, కొత్తకుండలో ఈగ జొచ్చినట్లు కొత్త సంసారం. రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు. బతుకుదెరువు లేక జనం వలస పోవుడు. ఇవన్నీ ఉండె. ఇవన్నీ పోవాలంటే పేదల సంక్షేమం జరగాలె, వ్యవసాయ స్థిరీకరణ జరగాలె అని ఆలోచించినం. ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నం. పెన్షన్లు తెలుగుదేశం హయాంలో రూ.70 ఉండె. తర్వాత కాంగ్రెసోళ్లు రూ.200 చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక ముందుగా రూ.1000 ఇచ్చినం. ఇప్పుడు రూ.2000 ఇస్తున్నం. భవిష్యత్తులో రూ.5000 చేయాలని నిర్ణయించినం. భారతదేశంలో పెన్షన్లను వందల రూపాయల నుంచి వెయ్యిల రూపాయలకు తీసుకపోయిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర రెవెన్యూ పెరిగినా కొద్దీ పేదలకు ఇచ్చే పెన్షన్లను పెంచుతూ పోతున్నం’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
‘కళ్యాణలక్ష్మి మొదలుపెట్టినప్పుడు నిధులు సరిపోతయో.. లేదోనన్న భయంతోటి రూ.50 వేలు పెట్టుకున్నం. తర్వాత రూ.75 వేలు చేసుకున్నం. ఆ తర్వాత రూ.1 లక్షకు పెంచుకున్నం. విదేశాల్లో చదువుకునేందుకు సీటొస్తే ఇదివరకు డబ్బులు లేక వెళ్లే అవకాశం లేకుండె. ఇప్పుడు రూ.20 లక్షలు ఇచ్చి బయటి దేశాల చదువుకు పంపిస్తున్నం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే తేడా లేకుండా వేల మంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో విదేశాల్లో చదువుతున్నారు. అంతేగాక ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టుకున్నం. రంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ ఇబ్రహీంపట్నంలోనే ప్రారంభం కాబోతున్నది. ఇటీవలే మీర్ఖాన్పేటలో శంకుస్థాపన కూడా పూర్తయ్యింది. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది..? ఎట్లున్న తెలంగాణ ఎట్లయ్యింది..? ఇవన్నీ మీరు ఆలోచన చేయాలె’ అని సీఎం సూచించారు.
‘విద్యారంగంలో ఘననీయంగా అభివృద్ధి జరిగింది. రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టుకున్నం. వాటినే రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చుకున్నం. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా 1,018 కాలేజీలు లేవు. ఒక రాష్ట్రమైనా, దేశమైనా బాగుపడిందా.. లేదా చూడటానికి రెండు గీటురాళ్లు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది తలసరి ఆదాయం. రెండోది తలసరి విద్యుత్ వినియోగం. తెలంగాణ వచ్చిన్నాడు తలసరి ఆదాయంలో మన ర్యాంకు 19, 20వ స్థానంలో ఉండె. ఇయ్యాల 3.18 లక్షల తలసరి ఆదాయంతో దేశంలో నెంబర్ 1గా తెలంగాణ ఉన్నది. తెలంగాణ వచ్చిన్నాడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1,140 యూనిట్లు ఉండె. ఇయ్యాల 2,200 యూనిట్లుగా ఉన్నది. ఇలా అనేక రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకుంట వస్తున్నం. ఓటేసేటప్పుడు ఇవన్నీ బేరీజు వేసుకుని మీరు ఓటేయాలె’ అని సీఎం కేసీఆర్ కోరారు.