అలంపూర్: వాల్మీకి బోయ కులస్థులను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ పార్టీయేనని సీఎం కీసీఆర్ ఆరోపించారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అలంపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణలో ఆర్డీఎస్ 1952లో ప్రారంభమైందని, దాని ద్వారా 85 వేల ఎకరాలు పారాల్సి ఉండెనని, అయితే, దాన్నుంచి కూడా రాయలసీమ నాయకులు అక్రమంగా నీళ్లు తరలించుకుని పోయారని ఆయన విమర్శించారు.
‘రాయల సీమ నాయకులు ఆర్డీఎస్ నుంచి అక్రమంగా నీళ్లు తరలించుకుపోతుంటే నాటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుడ్డిగా చూసిండ్రు. అపే ప్రయత్నం చేయలే. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదవులు వస్తే స్వార్థానికి వాడుకున్నారే తప్ప ఏ రకమైన పనులు చేయలే. బోయ ప్రజలను బీసీల్లో కలిపింది కాంగ్రెస్ నాయకులే. ఆ బోయలను ఎస్టీల్లో చేర్చాలని మనం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినం. ఆ తీర్మానాన్ని కేంద్రంలో ఉన్న బీజేపీ కిందేసుకుని కూసున్నది తప్ప కదలికలేదు. నేను వాల్మీకి బోయలకు హామీ ఇస్తున్నా. ఈ టర్మ్లో కేంద్రం మెడలు వంచుతా. వాల్మీకి బోయలను గిరిజనులుగా మార్చేదాకా పోరాటం చేస్తం’ అని సీఎం అన్నారు.
‘ఆర్డీఎస్ 85 వేల ఎకరాలు పారేదుంటే కాంగ్రెస్ చేతగానితనంతో మొత్తం పోయింది. నేను, నిరంజన్ రెడ్డి పోయి చూసొచ్చినం. పోరాటం తప్ప దారి లేదని పోరాటం చేసినం. పాదయాత్రగా రాజోలుకు చేరుకుని రాజోలుల పండుకున్నం. సుంకేశుల బరాజ్ మీదికి పోయి చూస్తున్నండగా ఓ మిత్రుడు కర్నూలు నుంచి ఈనాడు పేపర్ తీసుకొచ్చి చూపించిండు. ఆ పేపర్ల బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ఏమన్నడంటే.. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఒకవేళ ఆర్డీఎస్ తూములు మూసేస్తే మళ్లా బాంబులు పెట్టి పగులగొడతం అన్నడు. అప్పుడు నేను సుంకేశుల కట్ట మీద నిలబడి చెప్పిన. రాజశేఖర్ రెడ్డి నీకు దేవుడు ఆరు చేతులు ఇయ్యలేదు. నీగ్గూడా రెండే చేతులు ఉన్నయ్. నువ్వు ఆర్డీఎస్ తూములను బద్దలు కొట్టి చూడు, నీ సుంకేశుల బరాజ్ను వంద బాంబులు పెట్టి లేపేస్తం అని చెప్పిన. అంత ఘోరంగా ఉన్న కాలువ నీళ్లు తూములు బద్దలు కొట్టి తీసుకపోతే మాట్టాడినోడు లేడు. బోయలను బీసీలల్ల పెడితే మాట్లాడినోడు లేడు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను పెండింగ్లో పెడితే మాట్లాడినోడు లేడు. ఇది చాలక కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెప్తున్నరు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు’ అని సీఎం సూచించారు.