నిజామాబాద్ : త్వరలోనే సింగూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన పరిపాలన భవనం నిర్మించుకుని ప్రారంభించినందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని, ప్రజలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు.
మీ బిడ్డగా ఒకటే కోరుకుంటున్నా..
మీ బిడ్డగా ఒకటే కోరుతున్నాను. ఎప్పటికప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అప్పుడే సమాజం బాగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరిజు వేసుకుంటూ ముందుకు పోయే సమాజం ఉజ్వలంగా ముందుకు పోతోంది. ఆనాడు ఉన్న నాయకత్వం ఒక చిన్న పొరపాటు చేస్తే.. బలవంతంగా మనల్ని ఏపీలో కలిపితే, మళ్లీ మన తెలంగాణ వాసస్ తీసుకోవడానికి 60 ఏండ్లు పట్టింది. చావు అంచు వరకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది. ఒకనాడు నిజామాబాద్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు నిజాం సాగర్ నిర్మించుకున్నాం. కానీ వలస పాలనలో నిజాం సాగర్కు, సింగూరు ప్రాజెక్టుకు సాగునీరు మనకు రాలేదు. ఎన్నోసార్లు మన పొలాలు ఎండుతున్నాయని ధర్నాలు చేశాం. ఆ ధర్నాల్లో నేను కూడా పాల్గొన్నాను.
దేశమే ఆశ్చర్యపడేలా ముందుకు పోతున్నం
కొద్ది రోజుల్లో కాళేశ్వరం కాల్వలు సింగూరు ప్రాజెక్టు వద్దకు వస్తున్నాయి. దీంతో ఒక గుంట భూమి కూడా ఖాళీ లేకుండా ఉంటది. మీ అందరి దీవెనతో భారతదేశమే ఆశ్చర్యపడే పద్దతిలో ముందుకు పోతోంది. మన పొరుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. మన దగ్గర మహిళలు, పేదలు, విద్యార్థులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. దేశంలోనే అతి ఉత్తమమైన 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. అనేక తరతరాల నుంచి అణిచివేయబడ్డ దళిత సోదరుల కోసం రూ. 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. 60 ఏండ్లు మొత్తుకున్న గిరిజన బిడ్డలకు పంచాయతీలను ఏర్పాటు చేయలేదు. 3600 తండాలను పంచాయతీలను ఏర్పాటు చేస్తే 3600 మంది సర్పంచ్లు అయ్యారు. గురుకుల పాఠశాలలు, కల్యాణలక్ష్మి, రైతుబీమా వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.