మంథని: కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో బాధలు పడ్డారని సీఎం కేసీఆర్ చెప్పారు. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు రైతుల మేలును పట్టించుకోలేదని విమర్శించారు. మంథని నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని కట్టకపోతే తలుపులు పీక్కపోయిన విషయాన్ని గుర్తుచేశారు. కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నమని గప్పాలు కొట్టిన ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కూ చురకలు వేశారు.
‘కాంగ్రెస్ హయాంలో పంట పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకున్న రైతు తిరిగి కట్టకపోతే ఇంటి తలుపులు పీక్కపోయిండ్రు. బావుల కాడి మోటార్లు ఎత్తుకపోయిండ్రు. అంతేగానీ రైతుల కోసం నాడు ఒక్క రూపాయి ఇయ్యలే. ఇప్పుడు రైతుబంధు అనే పథకాన్ని సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో ఇయ్యాల్ల కొంచెం కొంచెం రైతుల మొఖాలు తెల్లబడుతున్నయ్. రైతుబంధు రూపంలో పెట్టుబడి వచ్చి, పంటలకు 24 గంటల కరెంటు వచ్చి ఇప్పుడిప్పుడే రైతులు గడ్డకుపడే పరిస్థితి వస్తున్నది’ అని సీఎం చెప్పారు.
‘గ్రామాలు సల్లగుండాలె, వ్యవసాయ స్థిరీకరణ జరగాలె, రైతులు మంచిగ బతుకాలె అని నిర్ణయించి తాము రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలు తీసుకొచ్చినం. కానీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. కేసీఆర్కు ఏం పని లేక రైతుబంధు తెచ్చిండు అంటున్నడు. నిజంగా రైతుబంధు దుబారనేనా..? రైతు బంధును ఎత్తేసేందుకు కాంగ్రెస్ గొడ్డలి భుజాన పెట్టుకుని రెడీగా ఉన్నది. వాళ్లు గెలిస్తే రైతు బంధుకు రాం రాం అంటరు. తీర్థం బోదాం తిమ్మక్క అంటే నేను గుల్లె, నువ్వు సల్లె. తియ్యగ పుల్లగ మాట్లాడితె నమ్మి గోల్మాల్ కావద్దు. తర్వాత నేను చేయగలిగేది కూడా ఏముండదు. మీరే కొట్లాడాల్సి వస్తది. నేను 24 ఏండ్లు కొట్లాడిన. ఇగ మీదే బాధ్యత’ అని అన్నారు.
‘ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఏమంటున్నడు..? కేసీఆర్ కరెంటును దుబారా చేస్తున్నడు, 24 గంటలు ఎందుకు, 3 గంటలు చాలు అంటున్నడు. మరి 3 గంటల కరెంటు సరిపోతదా..? కర్ణాటకల ఇదే కథ చేసిండ్రు. ఎన్నికల ముందు 24 గంటలు ఇస్తమని చెప్పిండ్రు. ఇప్పుడు 5 గంటలు ఇస్తున్నం అంటున్నరు. కానీ 4 గంటలే ఇస్తున్నరు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడ ఓ సభల మాట్లాడుతూ.. తమ దగ్గర రోజుకు 5 గంటల కరెంటు ఇస్తున్నం, కేసీఆర్ కావాలంటే నువ్వు బెంగళూరుకు రా సూద్దువు అంటున్నడు. దానికి నేనేమన్నా… 24 గంటల కరెంటు ఇస్తోళ్ల దగ్గరికొచ్చి నువ్వు 5 గంటలు ఇస్తున్నం అంటే దేంతోటి నవ్వాల్రా బాబు నాకర్థతమైతలేదని చెప్పిన’ అని సీఎం వ్యాఖ్యానించారు.