సిద్దిపేట : ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జల హృదయం సాగరం.. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించుకోవడం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. మనం కలలు కన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు సస్యశ్యామల తెలంగాణను చూస్తున్నాం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ అతి భారీ జలాశయం మల్లన్న సాగర్ను ప్రారంభించుకోవడం హర్షించుకోదగ్గ ఘట్టం. ఈ మహాయజ్ఞంలో ప్రతి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టు 58 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ఆ సమయంలో దుర్మార్గులు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. అక్కడ్నుంచే మన రాష్ట్ర చీఫ్ జస్టిస్కు ఫోన్ చేసి.. ఇది తెలంగాణ జీవనాడి.. ఉన్నతంగా ఆలోచించి ఈ ప్రాజెక్టును కాపాడాలని కోరాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 600 పైచిలుకు కేసులు వేశారు. ఇంజినీర్లు పదవీ విరమణ పొందిన కూడా ఈ ప్రాజెక్టు కోసం పని చేశారు. ఇంజినీర్లు అందరికీ సెల్యూట్. ఎండనక, వాననక, రాత్రింబవళ్లు కష్టపడి పని చేశారు. భయంకరమైన కరువు నేలలో ప్రజలకు న్యాయం చేసేందుకు పోరాడాం. కొందరు దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రగతి నిరోధక శక్తులుగా మారారు.
గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలను కడుగుతామని చెప్పాం. గోదావరి జలాలతో అభిషేకం చేయబోతున్నాం. ఎంతో మనసు పెట్టి ముందుకు పోయాం. హరీశ్రావు సేవలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. అవినీతిరహితంగా పని చేశాం. ఇది ఒక మల్లన్న సాగర్ కాదు.. తెలంగాణ జన హృదయం సాగరం. తెలంగాణ మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగరం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. సిద్దిపేటకే కాకుండా హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా దాహార్తిని తీర్చే ప్రాజెక్టు ఇది. 20 లక్షల ఎకరాలను తన కడుపులో పెట్టుకుని కాపాడుకునే ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని కేసీఆర్ పేర్కొన్నారు.