నమస్తే తెలంగాణ నెట్వర్క్, నవంబర్ 19: బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్, నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల బీఆర్ఎస్ ప్రచార సభలకు జనం నీరాజనం పట్టారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజలు, గులాబీ శ్రేణులతో ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోయియి. గులాబీ దళపతికి ప్రజలు, కార్యకర్తలు, తెలంగాణ అభిమానులు కేరింతలతో ఘన స్వాగతం పలికారు.
సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు జనంలోంచి విశేష స్పందన వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూనే సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్న సమయంలో చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణాలు హోరెత్తాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి రాకకోసం ఎదురుచూసిన ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు.. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా విన్నారు. అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ పిలుపునివ్వగా.. జై బీఆర్ఎస్, జై తెలంగాణ అంటూ ముక్తకంఠంతో నినదించారు.
సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ‘జై కేసీఆర్, జై తెలంగాణ’ నినాదాలతో సభాప్రాంగణాలు మార్మోగాయి. ధరణి కావాలా? వద్దా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ అడగటం తో ప్రజలు పెద్ద ఎత్తున ‘కావాలి.. కావాలి’ అంటూ నినదించారు. ధరణి కావాలంటే ఎవరికి ఓటు వేయాలని సీఎం అడగ్గా.. ‘బీఆర్ఎస్.. బీఆర్ఎస్’ అంటూ స్పందించారు. ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అభ్యర్థులు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, జైపాల్యాదవ్, విజేయుడును గెలిపించాలని కోరగా, జనం చెయ్యెత్తి జైకొట్టారు. సింగర్స్ మధుప్రియ, ప్రసాద్, మిట్టపల్లి సురేందర్, సంధ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటాపాట కార్యక్రమం ఆకట్టుకున్నది. గులాబీల జెండలే రామక్క.. పాటకు యువతతోపాటు అన్ని వయసుల వారు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. కల్వకుర్తిలో సీఎం హెలికాప్టర్ వద్దకు వెళ్తున్న సమయంలో ప్రజలు, అభిమానులు సీఎం కాన్వాయ్ వెంట హెలిపాడ్ దాకా పరుగులు తీశారు.