CM KCR | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి ఐసా హోతా హై! ఆప్ జనతా కే లియే ఐసా సోచ్తే హై?’ అంటూ మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లో చేరిన షేత్కరీ సంఘటన నాయకులు ఆశ్చర్యపోయారు. పార్టీలో చేరికల అనంతరం, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వారితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఉద్యమ కాలం నుంచి ఇప్పటి దాకా తెలంగాణ సాగించిన ప్రయాణాన్ని.. సాధించిన విజయాలను వారికి వివరించారు. వారూ మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులు, సరిహద్దు తెలంగాణ గ్రామాల్లో తమకు ఎదురైన అనుభవాలను తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వివిధ వర్గాలతో ఏ స్థాయిలో అయి తే మేధోమథనం చేశారో అదేరీతిలో ఆయన మహారాష్ట్ర రైతు నేతలతో చర్చించారు. అందరినీ తన దగ్గరికి తీసుకొని.. కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తన అనుభవాలను పంచుకున్నారు. ‘అందరూ కుర్చీలు దగ్గరికి వేసుకోండి. ఇప్పటిదాకా నేను చెప్పిన. ఇప్పుడు మీ వంతు. ఒక్కొక్కరూ చెప్పండి.. తొందరేం లేదు’ అంటూ కేసీఆర్ వారిని ఆహ్వానించారు. ఒక్కొక్కరుగా తమ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, రైతుసమస్యల పరిష్కారం కోసం వారు చేసిన పోరాటాలు, అనుభవాలను వివరించారు. అనంతరం కేసీఆర్ వారికి భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు అయ్యేదాకా మడమ తిప్పని పోరాటం చేయాలని, అందుకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని అభయం ఇచ్చారు.
నేడు షేత్కరీ సంఘటన క్షేత్రపర్యటన
షేత్కరీ సంఘటన ప్రతినిధి బృందం ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించి తెలంగాణ సాధించిన విజయాలను ప్రత్యక్షంగా తెలసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన అన్ని అంశాలను నేరుగా పరిశీలించాలని చెప్పారు. మంత్రి హరీశ్రావును రైతు నేతలకు తోడుగా ఉండి క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ఆదేశించారు.