CM KCR Press Meet : బీసీ జన గణనను కేంద్ర ప్రభుత్వం సత్వరమే మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణన చేపట్టాలని.. దీనిపై కేంద్రం నాన్చుడు ధోరణి ఏంటని ప్రశ్నించారు.
రాష్ట్ర శాసనసభలో ప్రజలకు సంబంధించి.. ప్రజల ఆకాంక్షలకు సంబంధించి ప్రజల కోరికలకు సంబంధించి చాలా తీర్మానలు చేసి కేంద్రానికి పంపించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మా గిరిజనుల జనాభా పలుచబడి ఉండేది. గిరిజనుల శాతం 6 శాతంగానే చూపెట్టబడింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆ శాతం పెరిగింది. దీంతో మేము రిజర్వేషన్లు పెంచుకుంటాం అని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరాం. తమిళనాడుకు ఎలా ఇచ్చారో మాకు కూడా ఇవ్వాలని చెప్పాం. 2017 నుంచి ఇప్పటి వరకు 50 సార్లు లెటర్లు రాశాం. చెప్పాం కానీ.. కేంద్రం దాని మీద ఎటూ తేల్చడం లేదు. లేకపోతే పెద్ద ఎత్తున గిరిజన పోరాటాలు కూడా రాష్ట్రంలో ప్రారంభిస్తాం. చాలా పెద్ద ఎత్తున హక్కుల సాధన కోసం ముందుకు కదులుతాం.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమాలు జరిగాయి. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దశాబ్దాల నుంచి ఉద్యమం జరుగుతోంది. ఆ విషయంలో కూడా తెలంగాణ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది. దాని మీద కూడా ఏదో ఒకటి తేల్చాలని కోరుతున్నాం.
అలాగే బీసీ ప్రజల నుంచి కూడా డిమాండ్ ఉంది. కుల గణన చేపట్టాలి. కొత్తగా జరిగేటటువంటి జనాభా లెక్కల్లో కుల గణన కూడా చేయాలి. ఎవరి కులం ఎంతుందో కూడా తేలాలి. ఈ లెక్కలు దాచి పెట్టడం ఎంత వరకు సమంజసం. పారదర్శకంగా ఉంటామన్న ప్రభుత్వాలు ఎందుకు దాచిపెడుతున్నాయి. కుల గణన ఎందుకు చేపట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీల గణన చేసినట్టుగానే బీసీల జన గణన కూడా జరగాలి.. అని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.