సూర్యాపేట: అందరి కృషితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేటలో నూతన ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభిచుకున్న జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలియజేశారు. సూర్యాపేటలో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని పేర్కొన్నారు.
రూ.100 కోట్లతో ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించుకున్నామని, ఇందులో అధికారుల కృషి ఎంతో ఉన్నదని, అందుకు వారిని అభినందిస్తున్నానని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 23వ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. తలసరి ఆదాయంలో మనం దేశంలోనే నెంబర్ వన్గా ఉన్నామని సీఎం తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామని పేర్కొన్నారు.
సుస్థిరాభివృద్ధి సూచీలో కూడా మనం నెంబర్ వన్గా ఉన్నామని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీలు, సెక్రెటేరియట్లు కూడా సరిగ్గా లేవని, మీ జిల్లాలో కలెక్టరేట్ అంత కూడా లేదండి మా సెక్రెటేరియట్, అసెంబ్లీ అని కొందరు చెబుతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో పస్తులు ఉండే పరిస్థితి లేదని చెప్పారు. ఒకప్పుడు ఫ్లోరైడ్తో విలవిల్లాడిన రాష్ట్రం.. ఇప్పుడు జీరో ఫ్లోరోసిస్ స్టేట్గా మారిందని అన్నారు.