CM KCR | రైతుల వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని, అందు కోసం పదిహెచ్పీల మోటర్లు పెట్టుకోవాలంటున్నాడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పంపుసెట్ల కోసం రూ.50-60వేలకోట్లు కావాలని.. వాటిని సీసాలిచ్చే రేవంత్రెడ్డి ఇస్తాడా? సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. కొడంగల్లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్ వచ్చిందంటే రకరకాల ఆగం చేసే పనులు జరుగుతయ్. ఆగమైపోతే వచ్చే ఐదేళ్లు కూడా ఆగం కావాల్సి ఉంటుంది. ఆలోచించి పని చేసే వారికి, ప్రజలకు సేవచేసే వారికి ఓటు వేస్తే కొడంగల్ మరింత అభివృద్ధి చెందుతుంది. మీరు తప్పకుండా నిలబడ్డ అభ్యర్థి ఎటువంటి వాడు, అవకాశం ఎట్ల పని చేస్తడు ? ప్రజల ఎలా అందుబాటులో ఉంటడు. అభివృద్ధి కోసం ఎట్ల తండ్లాడుతడు అని ఆలోన చేయాలి. ప్రతి అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ నడవడిక, దృక్పథం ఏంది ఆలోచించాలని కోరుతున్నా. అలాగే అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను చూడాలి’ అని పిలుపునిచ్చారు.
‘బీఆర్ఎస్ 15 సంవత్సరాలు హోరాహోరీగా కష్టపడి తెలంగాణ సాధించింది. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ప్రజలు వద్దు మొర్రె అని మొత్తుకుంటున్నా కూడా జబర్దస్తీగా ఆంధ్రాలో కలిపారు. 50 ఏళ్లు అరిగోసపడ్డాం. ఆకలి చావులు, బతుకపోవుడు, మంచినీళ్లు లేకుండే.. కరెంటు లేకుండే. రైతుల ఆత్మహత్యలు మన కండ్ల ముందటే జరిగినయ్. కొండగల్లో కూడా కరువుతో బతుకపోయారు. దేవుడి దయతో వర్షం పడితే ఒక పంట పండినట్లు లేకపోతే లేనట్టు అంత ఘోరంగా కొడంగల్ ఉండే. ఇవన్నీ మీరు చూశారు. మీ ఆశీర్వచనంతో బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంది. ఏం చేసిందో ప్రజలకు మీ కండ్ల ముందటనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని చూసింది. కాంగ్రెస్ పార్టీ రూ.200 పెన్షన్ ఇస్తే బీఆర్ఎస్ రూ.2వేల పెన్షన్ ఇస్తున్నది. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రూ.2వేలు ఇచ్చే పెన్షన్ను రూ.5వేలు ఇస్తాం. మనమే గెలుస్తున్నాం. అందులో డౌట్ లేదు. ఆ తర్వాత రూ.5వేల పెన్షన్ ఇస్తాం’ అని ప్రకటించారు.
‘ఆ తర్వాత ఒకటి ఒకటి సమస్య పరిష్కరించుకుంటున్నాం. రైతుల గురించి ఆలోచించాం. ఇవాళ సాగునీటికి పన్ను లేదు. 24గంటలు ఫ్రీ కరెంటు ఇస్తున్నాం. రైతుబంధు పథకాన్ని పుట్టిచ్చిందే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. భారతదేశంలో రైతుబంధు ఎక్కడా లేదు. మీకు అందుతుంది. ఎవరైనా రైతు చనిపోతే రూ.5లక్షలు కుటుంబానికి వారంలోగా అందుతున్నయ్. రైతులు పండించే ధాన్యంలో గింజకూడా లేకుండా రాష్ట్రంలో మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ రైతుల గురించి అమలు చేశాం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉత్తమకుమార్రెడ్డి చెబుతున్నడు.. కేసీఆర్ వేస్ట్గా డబ్బులన్నీ రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నడు అని అంటున్నడు. రైతుబంధు దుబారనా? పట్నం నరేందర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే రైతుబంధును ఎకరానికి రూ.16వేలు వస్తది’ అన్నారు.
‘ఇంకోమాట కొండంగల్ నుంచి పోటీ చేసే రేవంత్రెడ్డే చెబుతున్నడు. కరెంటు వేస్ట్గా కేసీఆర్ 24గంటల కరెంటు ఇస్తున్నడు. 24 గంటలు అవసరం లేదు. మూడు గంటలు చాలు అంటున్నడు. మూడుగంటల కరెంటు సరిపోతుందా? 24 గంటల కరెంటు కావాలంటే నరేందర్రెడ్డి గెలవాలి. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకడిని చేయమంటే సాధ్యమైతదా? ఎవరైతే మనల్ని కాపాడుతరో.. వాళ్ల వెంబడి ఉంటనే సాధ్యమైతది. మూడు గంటల కరెంటుతో పొలాలు ఎట్ల పారుతయ్ అంటే.. రైతు 10హెచ్పీ మోటర్ పెట్టుకోవాలని రేవంత్రెడ్డి అంటున్నడు రేవంత్రెడ్డి.
రైతుల దగ్గర 10హెచ్పీ మోటర్లు ఉంటయా? 10 హెచ్పీ మోటర్ పెట్టాలంటే రూ.50-60వేలకోట్లు కావాలి. మరి ఎవరు ఇవ్వాలి. సీసాలు ఇచ్చే రేవంత్రెడ్డి ఇస్తడా? 30 తారీఖుదాక సీసాలు ఇస్తరు.. ఆ తర్వాత అవతల పడుతరు. టెన్ హెచ్పీ మోటర్ పెట్టాలే? ఆలోచన చేయాలి.. ఇవి అట్టిమాటలు కావు. నేను చెప్పే నాలుగు మాటలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. 10 హెచ్పీ మోటర్లు ఎట్ల వస్తయ్ ? పూరా గైర్జిమ్మేదార్మాట. వ్యవసాయం ఉన్నోడు ఎవడూ ఇట్ల మాట్లాడడు. నాకు వ్యవసాయం ఉన్నది. నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా ? రైతుల బాధలు ఏందో నాకు తెలుసు. రేవంత్రెడ్డి ఉన్నడైనా దున్నిండా..? వ్యవసాయం ఎక్కడైనా ఉందా? అందుకే ఇట్ల మాట్లాడుతున్నరు’ అంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు.