CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని.. విద్యుత్ సంస్కరణల పేరుతో మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూలు చేయాలంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. బాల్కొండ సభలో కేంద్రం వ్యవహార శైలిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చిలేసింది. రైళ్లు, విమానాలు, ఓటరేవులు ప్రైవేట్. చివరకు కరెంటు కూడా ప్రైవేటే. సంస్కరణలు అనే పేరుపెట్టి.. ప్రతి మోటరుకు మీటరు పెట్టి ముక్కుపిండి పైసలు వసూలు చేయాలంటున్నరు. నన్ను బెదిరించారు. నువ్వు ఏమన్నా కట్ చేసుకో.. నా తలకాయ తెగిపడ్డా సరే మీటర్లు పెట్టా అని చెప్పినా’ అన్నారు.
‘సంవత్సరానికి రూ.5వేలకోట్లు నిర్దాక్షిణ్యంగా కట్ చేశారు. సంవత్సరానికి రూ.25వేలకోట్ల నష్టం తెలంగాణకు జరిగింది. కానీ, రైతుల మోటర్లు పెట్టలేదు. మీటర్లు ఎందుకు పెట్టలేదంటే.. దాని వెనుక ప్రబలమైన కారణం ఉంది. తెలంగాణ వచ్చిన నాడు.. వలసలు, కరెంటు లేదు, కరువులు, మంచినీళ్లు లేవు. సాగునీరు లేదు. చెట్టుకొకరు గుట్టకొకరు అయ్యాం. ఎన్నో బాధలుపడ్డాం. తలాపునకు నీళ్లున్నా మంచినీళ్లు దొరకలే అంత ఘోరం ఉండేది. ఈ రాష్ట్రాన్ని ఏదన్నా చేసి మళ్లీ మొదటికి రావాలి.. 50 ఏళ్ల కింద ఎలాగైతే మంచిగుండెనో మళ్లీ అలా కావాలి.. పల్లెలు కళకళలాడాలె.. రైతుల మొఖాలు ఆనందంతో ఉండాలి’ అన్నారు.
రైతుదగ్గర డబ్బున్నదంటే ఊరంతా డబ్బున్నట్టే లెక్క. కాబట్టి ఎలాగైనా చేసి కుదుటపర్చాలని ఓ పాలసీగా పెట్టుకున్నా. తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలని బీఆర్ఎస్ పాలసీ పెట్టుకున్నది. దీనికి ఐదారు చర్యలు తీసుకున్నాం. మహారాష్ట్రలో నీటి తీరువా బిల్లు వసూలు చేస్తారు. గ్రామాల్లో ఆర్థిక శక్తి రావాలి. వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. గ్రామాల్లో ఆర్థిక శక్తి రావాలి. రైతుల అప్పులు తీరిపోయి.. జేబుల్లో సొంత పెట్టుబడి ఉండాలి. ఆ తెలంగాణ కావాలని పట్టుబట్టాం. నీళ్లు ఫ్రీగా ఇస్తున్నాం. కరెంటు 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాం. పెట్టుబడికి రైతుబంధు ఇస్తున్నాం. అట్లనే రైతులుపండించిన ధాన్యం కొంటున్నాం’ అన్నారు.