CM KCR | అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీ దేశం నుంచి బీజేపీని వెళ్లగొట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ప్రగతి భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాల వారీగా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై బీజేపీని వెళ్లగొట్టాలి. భవిష్యత్ రాజకీయాలను ఊహించి చెప్పలేం. బీజేపీ అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలే. ఈ దేశం కోసం ముందుకు కదలాల్సింది దేశ ప్రజలే. కుల, మతాలు పక్కన పెట్టి జనమంతా పిడికిలి బిగించాలి.. అప్పుడే దేశ ప్రగతిని సాధించగలం. జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు.
ప్రజలు కలిసివస్తే నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది. అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ అవసరమైతే పెడతా. కొత్త పార్టీ పెడితే తప్పేమీ లేదు. మన దేశ ప్రజాస్వామ్యంలో ఆ స్వేచ్ఛ ఉంది. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. ఏదైనా సాధించవచ్చు. టీఆర్ఎస్ స్థాపించినప్పుడు ఎన్నో మాటలన్నారు. ఆత్మవిశ్వాసంతో పోరాడి.. జనాల్లో చైతన్యాన్ని తెచ్చాం. కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు.. జై తెలంగాణ అనలేదా? సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా? రాజకీయ ఫ్రంట్ను ఊహించొద్దు… ప్రజల ఫ్రంట్ను ఊహించండి. నేను ముంబై వెళ్తా.. ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈ విషయంలో నేను కీలకపాత్ర పోషిస్తా అన్నారు.