CM KCR | ‘రైతులు 10హెచ్పీ మోటర్ పెట్టుకుంటడా? ఈ మోటర్ ఎవరు కొనివ్వాలే. తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. 30లక్షల 10హెచ్పీ పంపుసెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఈ పంపుసెట్లు కొనాలంటే వీని తాత ఇస్తడా? అయ్య ఇస్తడా? ఎక్కడి నుంచి రావాలి’ అంటూ సీఎం కేసీఆర్ కాంగ్రెస్పై ధ్వజమెత్తారు. ఇబ్రహీపట్నం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నేతల వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘హేరాపేరీ లేకుండా.. ఒకరి భూమిని ఒకరు కాజేయకుండా.. ఎవరికి కోపం వచ్చినా కిందిమీద చేయకుండా ధరణి పోర్టల్ను తీసుకువచ్చాం. ఈ పోర్టల్తో రైతులు ఇవాళ నిశ్చింతగా ఉన్నరు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి.. గవర్నమెంట్ తన వద్ద ఉన్న అధికారాన్ని మీకు అప్పగించింది. మీ భూమిపై యజమాన్యం మీ చేతుల్లో ఉంది. మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం రాష్ట్రంలో ముఖ్యమంత్రికి కూడా లేదు. ఇవాళ పెరిగిన భూముల ధరలకు.. ఒకవేళ ధరణి లేకపోతే వీఆర్వోలు చేసిన గోల్మాల్కు ఎన్ని హత్యలు అయితుండే.. ఎంత గందరగోళం జరుగుతుండే.. ఎంత గడబిడ జరుగుతుండే. ధరణి పుణ్యమాని ఎవరి భూమి వాళ్లకే ఉన్నది. ఎవడూ ఎరాపేరి చేసే అవకాశం లేదు’ అన్నారు.
‘ధరణితోనే రైతుబంధు, రైతుబీమా, వడ్ల డబ్బులు వస్తున్నయ్. కానీ, రాహుల్గాంధీ, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తరట. వేస్తరు సంతోషమే.. తర్వాత రైతుబంధు డబ్బులు ఎలా వస్తయ్. కాంగ్రెస్ రాజ్యం వస్తే మళ్లీ పాత పద్ధతే వస్తది. ఇది ప్రమాదకరం. ప్రజలు ఆలోచించాలి. ఇబ్రహీంపట్నంలాంటి చోట గందరగోళం జరిగిపోతయ్. మళ్లీ దళారులు, పైరవీకారులు వస్తరు. ఎల్లయ్య భూమి మల్లయ్యకు రాసి.. మల్లయ్యది పుల్లయ్యకు రాసి జుట్లు ముడేసి.. కోర్టులచుట్టూ తిరుగుతూ లక్షల రూపాలు ఖర్చు పెట్టుకోవాలి. ఇదే కదా జరిగేది. మరి ధరణి ఉండాలా? పోవాల్నా? ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న వారిని ఏం చేయాలి. ధరణి ఉండాలంటే ఇబ్రహీంపట్నంలో కిషన్రెడ్డి గెలవాలి. ఎవరు గెలువాలో ప్రజలు మీరే ఆలోచించాలి’ అంటూ పిలుపునిచ్చారు.
‘ఉత్తమ్కుమార్రెడ్డి ఆయన మాట్లాడుతున్నడు. కేసీఆర్కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతుబంధు పెట్టి దుబారా చేస్తున్నడు అంటున్నడు. రైతుబంధు దుబారానా? రైతుబంధు ఉండుడు కాదు.. కిషన్రెడ్డిని గెలిపిస్తే రూ.16వేలు అవుతుంది. కిషన్రెడ్డి గెలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తది. ఇవన్నీ విషయాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టాలి. పీసీసీ అధ్యక్షుడు కరెంటుపై చెబుతున్నడు. అమెరికాలో చెప్పిండు. ఇక్కడ చెబుతున్నడు. పట్టుబట్టి చెబుతున్నడు. రైతులకు 24గంటల కరెంటు వేస్ట్ ఇస్తున్నడు కేసీఆర్ అంటున్నడు’ అంటూ విమర్శించారు.
24 గంటలు అవసరం లేదు. మూడు గంటలు ఇస్తే చాలు అంటున్నడు. మూడు గంటలతో పారుతుందా? కాంగ్రెస్ గెలిస్తే మూడు గంటలు కాదు.. 10హెచ్పీ మోటర్ పెట్టుకోవాలట. రైతులు 10హెచ్పీ మోటర్ పెట్టుకుంటడా? ఈ మోటర్ ఎవరు కొనివ్వాలే. తెలంగాణలో 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. 30లక్షల 10హెచ్పీ పంపుసెట్లు కొనాలంటే ఎంత డబ్బు కావాలి? ఈ పంపుసెట్లు కొనాలంటే వీని తాత ఇస్తడా? అయ్య ఇస్తడా? ఎక్కడి నుంచి రావాలి. వాళ్లు ఉన్నప్పుడు కరెంటు ఇవ్వచేత కాలేదు.. ఇవ్వలేదు. నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి రైతుల బాధేందో బతుకేందో నాకు తెలుసు’నన్నారు.