హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ నిధులను నిబంధనల మేరకే ఖర్చు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు నరేగా నిధులను వాడుకోవడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని చెప్పారు. గత ప్రభుత్వాలకు అవగాహన లేక ఈ నిధులను ఉపయోగించుకోలేదని, కానీ తాము సద్వినియోగం చేసుకుంటున్నామని అన్నారు. గురువారం శాసనసభలో సీఎం మాట్లాడుతూ.. మంచి ప్రభుత్వాలుంటే నిధులను డైనమిక్గా, గొప్పగా వినియోగిస్తాయని, ఇందుకు తెలంగాణే ఉదాహరణ అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎం ఇదే అసెంబ్లీలో రూ.365 కోట్లు దుర్వినియోగం అయినయని ఒప్పుకున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. తాము అలా చేయలేదని తెలిపారు. లక్ష కల్లాలు, ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు ఈ నిధులతోనే నిర్మిస్తున్నామని చెప్పారు. ‘ఈజీఎస్ నిధులను వైకుంఠ ధామాలకు వాడితే ఏంది? దేనికి వాడితే ఏంది? మన డబ్బే కదా?’ అన్నారు. కలెక్టర్లతో చర్చించిన తర్వాత ఈజీఎస్ నిధుల వినియోగం ఒకటే సంవత్సరంలో రూ.1600 కోట్లు పెరిగిందని చెప్పారు. దీంతో కేంద్రానికి అనుమానం వచ్చిందని, ఇక్కడికి వచ్చిన తనిఖీ బృందం.. పనులు బాగా చేస్తున్నారంటూ ప్రశంసించిందని తెలిపారు. కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ వచ్చి మొత్తం చూసి, సంతోషపడి దేశమంతా ఇట్లాగే జరగాలి అని అన్నారని చెప్పారు. అనంతరం జరిగిన ఓ సమావేశంలో మంచి పని చేస్తున్నారంటూ ప్రధాని ప్రశంసించారని తెలిపారు.