BRS Party | తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సరిగ్గా మధ్యాహ్నం 1.20 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధరించారు. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు తదితరులు పాల్గొన్నారు.
భారత రాజకీయ యవనికపై కొత్త ధ్రువతార వెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారింది. 21 ఏండ్ల అనుభవం, 60 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు కలిసి భారతదేశ తలరాతను మార్చేందుకు నడుం బిగించారు. ‘తెలంగాణను ఏ విధంగానైతే అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం’ అని సీఎం కేసీఆర్ దసరా రోజు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ‘మన పార్టీ పేరు ఇకపై భారత రాష్ట్ర సమితి’ అని నాడు ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. పేరు మార్పును ఆమోదిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు గురువారం లేఖ రాసింది. దీంతో టీఆర్ఎస్ నేటి నుంచి బీఆర్ఎస్గా అవతరించింది.