కొల్లాపూర్, సెప్టెంబర్ 13: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్ట్ వద్ద వెట్న్న్రు ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో నిర్వహించనున్న బహిరంగ సభ, వాహనాల పార్కింగ్ స్థలాలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి మంత్రి పరిశీలించారు. సభా పనులు సవ్యంగా కొనసాగాలని పూజలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. పాలమూరు నుంచి వచ్చే కృష్ణా జలాలను కళశాలలో తీసుకెళ్లాలని సూచించారు. ఈ జలాలతో ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఉన్న దేవుళ్ల పాదాలు కడిగి ప్రత్యేక పూజలు చేయాలని చెప్పారు. పాలమూరు జలాలతో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను నింపి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసి మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని వివరించారు. మంత్రి వెంట నాగర్కర్నూల్ జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, అధికారులు, నాయకులు ఉన్నారు.