పాలకుర్తి : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో మహబూబాబాద్ లో సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం, జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు రూ. 9.18 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. నియోజక వర్గంలో ప్రతి 150 మందికి ముగ్గురు చొప్పున కమిటీ వేసే ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన 20 కోట్ల రూపాయలను కమ్యూనిటీ హాళ్ల కోసం ఖర్చు చేయనున్నట్లు ,గతంలో మంజూరు అయిన పనులు తొందరగా పూర్తి చేయాలని అన్నారు.
గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. గ్రామంలో అర్హులైన ఇండ్లు లేని వారికి ఇండ్లను ఇచ్చే ప్రక్రియను పార్టీ గ్రామ నాయకులు నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. సాంకేతిక కారణాలతో పెన్షన్లు రాని వారి నుంచి దరఖాస్తులు మరోసారి తీసుకోవాలని నాయకులకు సూచించారు.