CM KCR | కరీంనగర్ : ధర్మపురిలో గోదావరి ఉన్నది కూడా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మరిచిపోయారని ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను చాలా ఘనంగా నిర్వహించుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ప్రజల కొంగు బంగారమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహ్మా స్వామి వారి కొలువైనటువంటి ప్రవిత్ర క్షేత్రమైన ధర్మపురి భూమికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఇక్కడ శేషప్ప కవి భూషణ వికాస! శ్రీధర్మ పుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర! అని చెప్పి రాసినటువంటి పద్యాలు మనమంతా చిన్నప్పట్నుంచి చదువుకున్న వాళ్లమే. ఒక్క మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్కు, బీజేపీకి, కాంగ్రెస్కు ఉండే తేడా.. నేను ఉద్యమం జరిగే సందర్భంలో ఈ క్షేత్రానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని, గోదావరి పుష్కరాల గురించి డిమాండ్ చేసే దాకా ఇక్కడున్న ఏ నాయకుడికి కూడా సోయి లేకుండే. ధర్మపురిలో గోదావరి ఉన్నది కూడా మరిచిపోయారు. గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలు అంటే చక్కగా విజయవాడ.. అక్కడకు పోవాలి. గుండు కొట్టించుకోవాలి. జేబులు ఖాళీ చేయాలి. మనం రావాలి. తర్వాత నేను డిమాండ్ చేసి ప్రతిజ్ఞ చేశాను. ఇక్కడే జరగాలని పట్టుబడితే ఆ ఏడాదే గొప్పగా జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఘనంగా గోదావరి పుష్కరాలు నిర్వహించుకున్నాం. అలాంటి నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రజల బాగు కోసం, ప్రజల హక్కు ల కోసం పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.