హైదరాబాద్ : ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయాలు అంటే ఒక గేమ్.. కానీ టీఆర్ఎస్కు అట్ల కాదు. టీఆర్ఎస్కు ఇది ఒక టాస్క్.. ఒక యజ్ఞం. పట్టువట్టి పని చేయాలి అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రసంగించారు. నర్సింహులు రాజకీయాల కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. మోత్కుపల్లికి కరోనా వచ్చినప్పుడు కోటి ఖర్చు అయినా పర్లేదు.. ఆయనకు మంచి వైద్యం అందించాలని చెప్పాను. మేమిద్దరం మంచి స్నేహితులం. మోత్కుపల్లితో నా స్నేహం రాజకీయాలకు అతీతం. దళితబంధు భేటీలకు మోత్కుపల్లి హాజరయ్యారు. దళిత బంధు పథకానికి తోడవుతానని మోత్కుపల్లి తనతో అన్నారు.
దళిత బంధుతో బలహీన వర్గాలను బలోపేతం చేసే యజ్ఞం ఇక్కడితో ఆగదు. గిరిజనులు, బీసీలు, ఈబీసీల్లో కూడా వస్తది. వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు ఏదో రూపంలో పంచుతాం. అతి ఎక్కువ బాధలో, దుఃఖంలో ఉన్న ప్రజలకు ముందు మేలు చేస్తాం. బలహీన వర్గాలకు వంద శాతం ఆదుకోవాలి. అప్పుడే గొప్పదనం ఉంటుంది. దళిత బంధుకు రూ. లక్షా 70 వేల కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపం. అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం. దళిత బంధు ద్వారా రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందన్నారు. భారత దళిత సమాజానికి తెలంగాణ దళిత సమాజం దిక్సూచి కావాలి. కర్ణాటకలోని రాయ్చూర్ ప్రజలు కూడా తెలంగాణలో కలుస్తామని అంటున్నారు. తెలంగాణ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయి అని సీఎం కేసీఆర్ అన్నారు.