CM KCR | గజ్వేల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలిరోజుల్లోనే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు మన శత్రువులు, సమైక్యవాదులు కుట్రలు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తదనంతంర పని ప్రారంభించుకున్నాం. రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకుపోవాలని చాలా విధాలుగా ఆలోచన చేశాం. మొదట్లోనే మన శత్రువులు, సమైక్యవాదులు ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేశారు. తొలి రోజుల్లోనే గవర్నమెంట్ కూలగొట్టాలని కుట్ర చేశారు. మన ఎమ్మెల్యేలను కొనాలనే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి ఎన్నో ఆటంకాలను అధిగమించుకుంటూ ఆలోచనలు మొదలు పెట్టాం అని కేసీఆర్ తెలిపారు.
మొదట సంక్షేమం తీసుకున్నాం. ఆ తర్వాత వ్యవసాయ రంగాన్ని స్థీరికరించుకున్నాం. రైతుల ముఖాల్లో సంతోషం చూశాం. అన్ని వర్గాల విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలు, కాలేజీలు స్థాపించుకున్నాం. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం. హైదరాబాద్లో ఇంతుకు ముందు ఎప్పుడు పోయినా ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ తప్ప ఇంకోటి తెల్వదు. రాబోయే ఐదారు నెలల్లో నగరంలో నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. మరో 2 వేల పడకలతో నిమ్స్ అభివృద్ధి చేసుకుంటున్నాం. మన ఊరు – మన బడి కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేసుకుంటున్నాం. అనేక రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. సంపద పెంచుతున్నాం. పరిశ్రమలు విపరీతంగా తెచ్చాం. 24 గంటల కరెంట్ ఉంటున్నది. దాని కారణంగా పెట్టబడులు తరలివస్తున్నాయి అని కేసీఆర్ తెలిపారు.