CM KCR | నిజామాబాద్ : రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది.. ఈ జాతీయ పార్టీల హవా ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 2024 తర్వాత దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. ఏక పార్టీ ప్రభుత్వం రాదు. అన్ని ఎంపీలు మనం గెలుచుకుంటే బీఆర్ఎస్ తడాఖా అప్పుడు ఢిల్లీలో చూపెడుదాం అని కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నాం. హిందూ, ముస్లిం, క్రైస్తవుల అనే తేడా లేకుండా అన్ని మతాల ప్రజలను కలుపుకొని పోతున్నాం. అందర్నీ సమానంగా ఆదరిస్తున్నాం. ప్రతి స్కీంలో అందరూ భాగస్వామ్యం అవుతున్నాం. అన్ని మతాల వారిని సమానంగా చూస్తున్నాం. తెలంగాణ కల్చర్ గంగా జమునా తెహజీబ్. హిందూ, ముస్లింలు అందరూ సోదరుల్లా కలిసి ఉండి మొత్తం ప్రపంచానికి ఉదాహరణగా ఉంటున్నాం. పదేండ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు. బ్రహ్మాండంగా శాంతియుతంగా ముందుకు పోతున్నాం. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా మెయింటెన్ చేస్తున్నాం. రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతున్నాం.. బీఆర్ఎస్ ముమ్మాటికి సెక్యులర్ పార్టీ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ మతపిచ్చితోని మంటలు పెట్టే పార్టీ. మాటమాటకు మతం పిచ్చి మాటలు. ప్రజలను డివైడ్ చేయడం వంటి పనులు చేస్తోంది. బీజేపీ మనకు ఎంత మోసం చేసిందంటే.. దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. 100 ఉత్తరాలు రాశాను కానీ ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు. జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలన్న చట్టాన్ని ఉల్లంఘించారు మోదీ. వంద సార్లు అడిగాను. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు. బావుల కాడ మోటర్లకు మీటర్లు పెట్టాలని చెప్పరు.. నేను పెట్టలేదు. ఇందుకు ఐదేండ్లకు రూ. 25 వేల కోట్లు కట్ చేశారు. బడ్జెట్ కట్ చేసి, నవోదయ, మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచించి ఓటు వేయాలి. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయొద్దు. ఈ విషయాలపై బీజేపీ నాయకులను నిలదీసి అడగండి. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణకు లాభం చేయలేదు.. నష్టం చేశాయి. తెలంగాణను కాంగ్రెస్ ముంచితే, బీజేపీ పదేండ్ల నుంచి కృష్ణాలో మన వాటా తేల్చదు. డబ్బులు రానివ్వదు. ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వదు.. ఇలా చాలా ఇబ్బంది పెడుతుంది అని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.