CM KCR | హైదరాబాద్ : తెల్ల రక్తకణాల మాదిరిగానే తెలంగాణ తెల్ల కోట్ డాక్టర్లు పని చేస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రయివేటు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ద్వారా సంవత్సరానికి 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ విధానంలో 9 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధక శక్తి ఉండాలంటే.. తెల్ల రక్తకణాలు రక్తంలో ఏ విధంగా అయితే పని చేస్తాయో.. తెలంగాణ ఉత్పత్తి చేయబోయే తెల్ల కోట్ డాక్టర్లు రాష్ట్రానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కూడా కాపాడుతారనడంలో నిర్వివాద అంశం.. ఇందులో ఎవరికి సందేహం లేదు అని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. విద్యుత్ రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతమైన విజయాలు సాధించాం. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం. గంజి కేంద్రాలతో విలసిల్లినటువంటి మన పాలమూరు జిల్లాలో ఇప్పుడు వ్యవసాయం పరుగులు పెట్టడమే కాకుండా, పాలమూరు ప్రాజెక్టు ప్రారంభించుకునే స్థాయికి చేరడమే కాకుండా.. ఆ జిల్లాలో అద్భుతంగా ఐదు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఒక్క కాలేజీ కూడా లేనిచోట మనం సాధించిన గొప్ప విజయం. ఒక్క కాలేజీ లేని నల్లగొండలో మూడు కాలేజీలు వచ్చాయి. ఇలా అనేక జిల్లాల్లో మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. మారుమూల జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలు.. అలా అడవి బిడ్డలు నివసించే ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీలు స్థాపించుకొని అద్భుతాలు సృష్టించబోతున్నామని కేసీఆర్ తెలిపారు.
ఒక దేశం కావొచ్చు.. రాష్ట్రం కావొచ్చు.. ఎక్కడైతే వైద్యారోగ్య వ్యవస్థ పటిష్టంగా, పకడ్బందీగా ఉంటుందో.. అక్కడ తక్కువ మరణాలు, నష్టాలు సంభవిస్తాయని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉండేచోట ఎక్కువ నష్టాలు సంభవిస్తాయని పెద్దలు చెప్పారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెడికల్ కాలేజీలతో పాటు అద్భుతమైన ఆస్పత్రులను కూడా తీసుకువస్తున్నాం. వందలాది బెడ్స్తో మెడికల్ ఫెసిలిటీ వస్తుంది. వైద్యారోగ్య శాఖ చాలా విజయాలు సాధించింది. దేశంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇది మన సాధించిన ఘనత. రాష్ట్రం ఏర్పడే నాటికి 17 వేల పడకలు ఉంటే.. ఇప్పుడు 34 వేల పడకలకు చేరుకున్నాం. మరో 6 హాస్పిటల్స్ నిర్మాణంలో ఉన్నాయి. వరంగల్లో అద్భుతమైన హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్కు నలువైపులా టిమ్స్ నిర్మిస్తున్నాం. గచ్చిబౌలి, ఎల్బీ నగర్, అల్వాల్, ఎర్రగడ్డలో 1000 పడకల చొప్పున హాస్పిటల్స్ నిర్మిస్తున్నాం. నిమ్స్ను మరో 2 వేల పడకలతో విస్తరిస్తున్నాం. ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరుకోబోతోంది. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖను అభినందిస్తున్నాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.